Archive for August, 2018

వాల్మీకి రామాయణం 243 వ భాగం, సుందరకాండ

అప్పుడాయన అనుకున్నాడు ” ఇంత లంకా పట్టణాన్ని 4 అంగుళాలు కూడా వదలకుండ నేను వెతికాను, అయినా నాకు సీతమ్మ దర్శనం కాలేదు. బహుశా ఒంటి మీద వస్త్రము లేని స్త్రీలని ఎందరినో ఈ లంకా పట్టణంలో నేను చూశాను, అందువలన నాయందు ధర్మమునకు లోపం వచ్చిందేమో. నేను వెతుకుతున్నది సీతమ్మని, ఆమె ఒక స్త్రి. అందువలన ఆమెని వెతుకుతున్నప్పుడు సీతమ్మో కాదో అని ఆ స్త్రీల వంక చూశాను. ఆ స్త్రీలని అలా చూశాను కాని, నా మనసునందు ఎటువంటి వికారము కలగలేదు, నాకు ఎవరూ గుర్తులేరు. నేను పవిత్రముగానే ఉన్నాను ” అని హనుమంతుడు తన మనస్సులో భావన చేసి, ” నేను సీతమ్మ దర్శనం చెయ్యలేకపోయాను. ఇప్పుడు నేను వెనక్కి వెళితే అక్కడ ఉన్న వానరాలు నన్ను ‘ సీతమ్మ దర్శనం చేశావా? ‘ అని అడుగుతారు. ‘ నాకు సీతమ్మ జాడ తెలియలేదు ‘ అని చెప్తాను. సీతమ్మ జాడ తెలీకుండా వెనక్కి వెళితే సుగ్రీవుడు చంపేస్తాడని అందరూ ప్రాయోపవేశం చేస్తారు. నేను వెళ్ళి ఈ మాట సుగ్రీవుడికి చెబితే, మిత్రుడైన రాముడికి సహాయం చెయ్యలేకపోయానని సుగ్రీవుడు ప్రాణం వదిలేస్తాడు. ఉన్న స్నేహితుడు కూడా వెళ్ళిపోయాడని రాముడు కూడా ప్రాణము వదిలేస్తాడు. రాముడు లేనప్పుడు లక్ష్మణుడు ఉండడు. అప్పుడు అక్కడున్న వానరకాంతలందరూ ప్రాణములు వదిలేస్తారు. తదనంతరం వానరులందరు మరణిస్తారు. ఈ వార్త అయోధ్యకి చేరి కౌసల్య, కైకేయి, సుమిత్ర, భరతుడు, శత్రుఘ్నుడు మరణిస్తారు, తరవాత అయోధ్యలొ అందరూ మరణిస్తారు. నేను పట్టుకెళ్ళే వార్త వల్ల ఇంత మంది మరణిస్తారు. ఈ వార్తని నేను తీసుకువెళితే ఎంత వెళ్ళకపోతె ఎంత.

బహుశా రావణుడు సీతమ్మని తీసుకువస్తున్నప్పుడు, ఆయన ఒడిలో కొట్టుకుంటున్న సీతమ్మ జారి సముద్రంలో పడిపోయి ఉంటుంది, కాదు కాదు, సీతమ్మ అంత పిరికిది కాదు. తన పాన్పు చేరడంలేదని, రావణుడే సీతమ్మని ముక్కలుగా నరికి ఫలహారంగా తినేసుంటాడు, కాదు కాదు, కాముకుడైనవాడు తాను కామించిన స్త్రీని సంహరించడు. లేకపోతె రాక్షసులు సీతమ్మని తినేసుంటారు, కాదు కాదు, రావణుడు కామించిన స్త్రీని తినగలిగే ధైర్యం రాక్షసులకు ఉండదు. రాముడికి సీతమ్మ జాడ తెలియకూడదని రావణుడే అమ్మని ఎక్కడో దాచి ఉంటాడు. కాబట్టి నిద్రపోతున్న రావణుడి పది తలలు గిల్లేసి, వాడి మృతకళేబరాన్ని రాముడి పాదాల దెగ్గర పడేస్తాను, లేదా ఈ లంకని పెల్లఘించి పట్టుకుపోతాను. కాదు కాదు, సీతమ్మ జాడ చెప్పలేనప్పుడు ఇవన్నీ తీసుకువెళ్ళడం ఎందుకు, అందుకని నేను అసలు వెనక్కి వెళ్ళను. సీతమ్మ జాడ దొరికేవరకు వానప్రస్థుడిలా ఉంటాను, లేదా అగ్నిలోకి ప్రవేశిస్తాను, లేదా నీటిలోకి ప్రవేశించి శరీరాన్ని వదిలేస్తాను ” అనుకున్నాడు.

కాని ఆయన వెంటనే ” ఛి! మరణించడం ఏమిటి, ఆత్మహత్య మహా పాపం. మళ్ళి ఉత్సాహాన్ని పొంది వెతుకుతాను ” అనుకొని,

నమోస్తు రామాయ సలక్ష్మణాయ, దేవ్యైచ తస్యై జనకాత్మజాయై, |
నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో, నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః ||
(దీనిని రామాయణానికి ప్రార్ధనా శ్లోకంగా చెబుతారు)

” లక్ష్మణుడితో కూడుకుని ఉన్న రాముడికి నమస్కారం, జనకుని కూతురైన సీతమ్మకి నమస్కారం, రుద్రుడికి, ఇంద్రుడికి, యముడికి, వాయుదేవుడికి నమస్కారం, చంద్రుడికి, సూర్యుడికి, దేవతలందరికి నమస్కారం. నాకు సీతమ్మ తల్లి దర్శనం అయ్యేటట్టు దేవతలందరు కాటాక్షించెదరుగాక ” అని నమస్కారం చేశాడు.

వాల్మీకి రామాయణం 242 వ భాగం, సుందరకాండ

అక్కడినుండి ముందుకి వెళ్ళగా, రకరకాలైన బంగారు పాత్రలు, వెండి పాత్రలు, మణిమాణిక్యాలు పొదిగిన పాత్రలు, పువ్వులనుండి తీసిన సుర, పళ్ళనుండి తీసిన సుర, తేనెనుండి తీసిన సురలు మధురమైన వాసనలు వెదజల్లుతూ ఉన్నాయి. అక్కడ తాగేసిన పాత్రలు, సగం తాగి కిందపడేసిన పాత్రలు, స్త్రీ-పురుషులు ఒకరిమీద ఒకరు ఉండరాని విధంగా మత్తులో పడి ఉన్నారు. హనుమంతుడు వాళ్ళందరినీ చూసుకుంటూ ముందుకు వెళ్ళాడు. అప్పుడాయన అందరూ ఆహారం తీసుకునే ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ నెమళ్ళ మాంసం, కోళ్ల మాంసం, మేకల మాంసం, గొర్రెల మాంసం, అడవిపందుల మాంసం అలా రకరకాలైన పదార్ధాలు ఉన్నాయి. హనుమ ఆ ప్రాంతాన్నంతటినీ వెతికారు. మళ్ళి పుష్పక విమానంలోకి వెళ్ళి, అందులో వెతికి కిందకి దిగుతూ అనుకున్నారు ” ఈ లంకా పట్టణం అంతా వెతికాను, ఇందులో వెతకని ఇల్లు లేదు. ఇక్కడ గంధర్వ, యక్ష, కిన్నెర స్త్రీలు, రాక్షసులు కనపడుతున్నారు కాని సీతమ్మ తల్లి జాడ కనిపెట్టలేకపోయాను ” అని బాధ పడ్డాడు.

కాని వెంటనే ” ఎవడు శోకమునకు లొంగిపోడో, ఎవడు నిరంతరము ఉత్సాహముతొ ఉంటాడో, వాడు మాత్రమే కార్యాన్ని సాధించగలడు. అందుకని నేను శోకమునకు లొంగను, మళ్ళి సీతమ్మని అన్వేషిస్తాను, మళ్ళి ఈ లంకా పట్టణం అంతా వెతికేస్తాను ” అని ఉత్సాహాన్ని పొంది లంకా పట్టణం అంతా వెతికి కూర్చున్నాడు.

వాల్మీకి రామాయణం 241 వ భాగం, సుందరకాండ

తరువాత హనుమంతుడు అక్కడ పడుకొని ఉన్న స్త్రీలని వెతికాడు. అక్కడ పడుకుని ఉన్న స్త్రీలలో ఒకామె మృదంగాన్ని గట్టిగా పట్టుకొని పడుకుంది, ఒకామె వేణువు ఊదుతూ నిద్రపోయింది, ఒకామె వీణ వాయిస్తూ నిద్రపోయింది, ఒకామె పక్కన ఉన్న స్త్రీ మీద చీరని తీసి తన మీద దుప్పటిగా కప్పుకుంది. ఆ స్త్రీలు అక్కడున్న సంగీత వాయిద్యాలని గట్టిగా కౌగలించుకొని, వాటిని రావణుడిగా భావించి చుంబిస్తున్నారు. అక్కడ ఒక్క స్త్రీ ఒంటి మీద ఆభరణము కాని, వస్త్రము కాని సరిగ్గా లేదు. అలా పడుకొని ఉన్న స్త్రీలందరినీ హనుమంతుడు చూసుకుంటూ వెళ్ళాడు.

రావణుడికి కొంత దూరంలో, బంగారు తల్పం మీద అపారమైన సౌందర్యవతి అయిన ఒక స్త్రీ పడుకొని ఉంది. ఆవిడ రావణుడి భార్య అయిన మండోదరి. ఆవిడని చూడగానే ‘ ఈవిడే సీతమ్మ ‘ అని హనుమంతుడు అనుకొని, తన భుజాలని కొట్టుకుని, తోకని ముద్దు పెట్టుకుని, విచిత్రమైన పాటలు పాడి, పిల్లిమొగ్గలు వేసి, గెంతులు వేసి, స్తంభాల పైకి ఎక్కి, కిందకి దూకి తన కోతి బుద్ధిని బయట పెట్టుకున్నాడు. కొంతసేపటికి ఆయన అనుకున్నారు ” మా అమ్మ సీతమ్మ, రాముడు పక్కన లేనప్పుడు ఇటువంటి పట్టు పుట్టం కట్టుకొని, పక్కన రావణుడు ఉండగా ఇంత హాయిగా నిద్రపోతుందా. అరరే నా బుద్ధి ఎంత వైక్లవ్యాన్ని పొందింది. ఈమె సీతమ్మ కాదు ” అనుకొని ముందుకి సాగిపోయాడు.

వాల్మీకి రామాయణం 240 వ భాగం, సుందరకాండ

అక్కడ పడుకున్న స్త్రీలు ఒకరి మీద ఒకరు చెయ్యి వేసుకుని, ఒంటి మీద వస్త్రం సరిగ్గా లేకుండా పడుకొని ఉన్నారు. అందరి ముఖాలు పద్మాలలా ఉన్నాయి. అలా కొన్ని వేల స్త్రీలు మదవిహ్వలులై, రావణాసురుడితో కామోప భోగాన్ని అనుభవించి, విశేషమైన మధ్యపానం చేసి, మత్తెక్కి, బడలి నిద్రపోతున్నారు. అక్కడ ఉన్న వేల స్త్రీలు తక్కువ జాతిలో జన్మించినవారు కాదు, ఎవరూ సౌందర్యం తక్కువైనవారు కాదు, ఇంతకముందు వేరొక పురుషుడిని పొందినవారు కాదు, నడువడి తెలియనివారు కాదు, వీళ్ళందరూ రావణుడిని కోరుకుని వచ్చినవారు.

రావణుడు పడుకున్న తల్పం బంగారంతో చెయ్యబడింది, దానికి వైడుర్యాలతో మెట్లు కట్టబడి ఉన్నాయి. పడుకుని ఉన్న రావణుడికి చామరం వేస్తున్న ఉత్తమమైన స్త్రీలు ఆ చామరంలోకి అనేకరకములైన పరిమళద్రవ్యాలని చేర్చి, జాగ్రత్తగా వీస్తున్నారు. ఆ తల్పం మీద, ఉత్తమమైన పరుపు మీద రావణుడు పడుకొని ఉన్నాడు. హనుమంతుడు రావణుడి తల్పం దెగ్గరికి వెళితే, రావణుడి రోమ కూపాల నుండి కొడుతున్న బ్రహ్మతేజస్సు చేత హనుమంతుడు అవతలకి తొలగతోయబడ్డాడు. అప్పుడు హనుమంతుడు దూరంగా వెళ్ళి ఒక వేదిక మీదనుండి రావణుడిని చూస్తే, ఆకాశంలో వెళ్ళిపోతున్న ఒక నల్లటి మబ్బు భూమి మీదకి దిగిపోయి తల్పం మీద పడుకుంటే ఎలా ఉంటుందో, రావణుడు అలా ఉన్నాడు. ఆయన పెట్టుకున్న కుండలములు ప్రకాశిస్తున్నాయి. ఆయన అనుభవించి సుఖము చేత, తాగిన మధ్యము చేత తిరుగుడుపడుతున్న ఎర్రటి నేత్రములతో ఉన్నాడు. అరమోడ్పు కన్నులతో(సగం మూసిన కన్నులతో), పెద్ద చేతులతో, ఉత్తమమైన వస్త్రములు కట్టుకొని నిద్రపోతున్నాడు. దేవేంద్రుడి వాహనమైన ఐరావతం తన దంతములచేత కుమ్మితే ఏర్పడిన గాయములు రావణుడి శరీరం మీద కనపడుతున్నాయి, అలాగే శ్రీ మహావిష్ణువు తన చక్రం చేత కొట్టినప్పుడు ఏర్పడిన మచ్చలు ఉన్నాయి, దేవేంద్రుడు తన వజ్రాయుధం చేత కొట్టినప్పుడు తగిలిన దెబ్బలు కనపడుతున్నాయి. ఆ రావణుడు బాగా బలిసిన భుజాలతో ఉన్నాడు, ఆయన చేతి గోళ్ళు ఎర్రటి కాంతితో మెరిసిపోతున్నాయి. ఆయన ఆ తల్పం మీద, పడుకొని ఉన్న పాములా ఉన్నాడు, ఆయన చేతులు పరిఘలలా ఉన్నాయి, ఆయన చేతులకి ఉన్న వేళ్ళు రెండు అయిదు తలల పాముల్లా ఉన్నాయి.

 

వాల్మీకి రామాయణం 239 వ భాగం, సుందరకాండ

అప్పుడు హనుమంతుడు ” మా అమ్మ ఇలాంటి స్థలంలో, ఇలా రాక్షసులతో మధ్యం సేవించి, ఆనందంగా ఉండదు. మా అమ్మ కన్నులవెంట వేడి నీరు కారుతూ వక్షస్థలం మీద పడిపోతూ ఉంటుంది, రాముడి చేత కట్టబడిన దీర్ఘమైన మంగళసూత్రం మా అమ్మ మెడలో మెరుస్తూ ఉంటుంది, మా అమ్మ కన్నులకు ఉన్న వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా ఉంటాయి, పరిపూర్ణమైన ప్రేమ కురిపించే కన్నులతో మా అమ్మ ఉంటుంది, వనంలో ఉన్న నెమలిలా మా అమ్మ ఉంటుంది ” అనుకుంటూ, పుష్పక విమానం నుంచి కిందకి దిగి, రావణాసురుడు పడుకున్న శయనాగారం వైపు వెళ్ళాడు.

రావణాసురుడు పడుకున్న ఆ మందిరంలో గోడలకి కాగడాలు పెట్టబడి ఉన్నాయి. ఆయన పడుకున్న తల్పము బంగారంతో చెయ్యబడింది, అక్కడ పడుకున్న స్త్రీలు ధరించిన ఆభరణములు ఎర్రటి బంగారంతో చెయ్యబడినవి, రావణాసురుడు పెట్టుకున్నవి బంగారంతో చెయ్యబడిన ఆభరణములు. గోడలకి ఉన్న కాగడాల నుండి వస్తున్న కాంతి, అక్కడ ఉన్న స్త్రీల ఆభరణముల నుండి వస్తున్న కాంతితొ కలిసి, ఏదో మండిపోతుందా అన్నట్టుగా ఒక ఎర్రటి కాంతి ఆ ప్రదేశాన్ని ఆవరించింది. అక్కడ వెలుగుతున్న కాగడాలు అటూ ఇటూ కదలకుండా అలాగె నిలబడి వెలుగుతున్నాయి. ఆ కాగడాలని చూస్తుంటే, జూదంలో ఓడిపోయినా కాని ఇంటికి వెళ్ళకుండా, పక్కవాడి ఆటని దీక్షగా చూస్తున్న జూదరిలా ఉన్నాయి.

వాల్మీకి రామాయణం 238 వ భాగం, సుందరకాండ

అప్పుడాయన రావణ అంతఃపురంలో ఉన్న పుష్పక విమానంలోకి ప్రవేశించాడు. ( పుష్పక విమానాన్ని మొట్టమొదట విశ్వకర్మ నిర్మించి బ్రహ్మకి ఇచ్చాడు. కొంతకాలానికి కుబేరుడు బ్రహ్మని గురించి తపస్సు చేస్తే, బ్రహ్మదేవుడు కుబేరుడికి పుష్పక విమానాన్ని ఇచ్చాడు. కుబేరుడి తమ్ముడైన రావణుడు ఆయనని చావగొట్టి ఆ విమానాన్ని తెచ్చుకున్నాడు). ఆ పుష్పక విమానంలో కూర్చుని మనస్సులో ఒక ప్రదేశాన్ని ఊహించుకుంటే, అది వాళ్ళని కన్నుమూసి తెరిసేలోగా అక్కడికి తీసుకువెళుతుంది. ఆ పుష్పకానికి వజ్ర వైడుర్యాలతో నగిషీలు పెట్టబడి ఉంటాయి, అందులో సరోవరాలు, పద్మాలు, ఉద్యానవనాలు, బంగారంతో చెయ్యబడ్డ వేదికలు, కూర్చోడానికి ఆసనాలు, పడుకోడానికి తల్పాలు, విహరించడానికి ప్రదేశాలు ఉంటాయి. అందులోకి ఎంతమంది ఎక్కినా, ఇంకా ఒకడికి చోటు ఉంటుంది. అందులో ఉన్న తివాచి మీద ఈ భూమండలం అంతా చిత్రీకరించబడి ఉంది. ఈ భూమి మీద ఎన్ని పర్వతాలు ఉన్నాయో, అవన్నీ ఆ తివాచి మీద చెక్కబడి ఉన్నాయి. అలాగే ఏ పర్వతం మీద ఎన్ని చెట్లు ఉన్నాయో, అన్ని చెట్లు అందులో ఉన్నాయి. వాటితో పాటు ఆ చెట్లకి ఉన్న పువ్వులే కాకుండా ఆ పువ్వులలో ఉన్న కేసరములు కూడా చెక్కబడి ఉన్నాయి. దానికి కొంచెం పక్కనే లక్ష్మీదేవి పద్మములలో పద్మాసనం వేసుకొని, నాలుగు చేతులతో కూర్చున్నట్టుగా, రెండు ఏనుగులు బంగారు కలశములు పట్టుకొని, పద్మపు రేకులతో అమ్మవారిని అభిషేకిస్తున్నట్టుగా అక్కడ ఒక చిత్రం ఉంది.

వాల్మీకి రామాయణం 237 వ భాగం, సుందరకాండ

అది రాక్షసేంద్రుడైన రావణాసురుడి అంతఃపురం. దానికి మొదటి కక్ష్యలో కొంతమంది గుర్రాల మీద కాపలా కాస్తుంటారు. రెండవ కక్ష్యలో ఏనుగుల మీద కొంతమంది తిరుగుతూ ఉంటారు. ఆ వెనక కక్ష్యలో కొంతమంది కత్తులు పట్టుకొని తిరుగుతుంటారు. ఆ తరువాత కక్ష్యలో, ప్రభువు నిద్రలేవగానే ఒంటికి రాయడానికి కొంతమంది చందనం తీస్తుంటారు. తరువాత కక్ష్యలో ఆయన ధరించే పుష్పమాలికలు ఉంటాయి, ఆ వెనకాల ఆయనకి బాగా నిద్ర పట్టడానికి వాద్యపరికరాల మీద సన్నటి సంగీతాన్ని కొంతమంది వాయిస్తూ ఉంటారు.

‘ ఇంకా అందరూ నిద్రపోలేదు కనుక కొంతసేపయ్యాక రావణ అంతఃపురంలోకి వెళ్ళి చూస్తాను ‘ అని హనుమంతుడు అనుకొని, బయటకి వచ్చి మళ్ళి కొన్ని ఇళ్ళల్లోకి వెళ్ళి చూశాడు. ఆ ఇళ్ళల్లో ఉన్న రాక్షసులు లంకకి పూజ చేస్తూ శంఖాలు, భేరీలు, గంటలు మోగిస్తున్నారు. అక్కడ ఉన్న ఇళ్ళు చూసి ” ఇది ఇంద్రపురా, గంధర్వ నగరమా, పొరపాటున నేను స్వర్గలోకానికి వచ్చానా?. అసలు ఇంద్రుడికి ఎన్ని భోగాలు ఉన్నాయో అవన్నీ ఈ లంకా పట్టణంలో కనిపిస్తున్నాయి ” అనుకున్నాడు. అక్కడున్న ఇళ్ళల్లో ఎంత గొప్ప పండితుడైనా ఒక దోషాన్ని కూడా చూపలేడు, అంత అద్భుతంగా అక్కడి ఇళ్ళు ఉన్నాయి. దేవతలకి కూడా ఆ ఇళ్ళల్లోకి వస్తే పూజ చేసుకోవాలనిపిస్తుంది. అక్కడున్న కిటికీలు కూడా వజ్ర వైడుర్యాలతో అలంకరింపబడి చాలా అందంగా ఉన్నాయి. ఆ లంకా పట్టణం యొక్క శోభని హనుమంతుడు చాలా బలంతో చూశాడు (లంకా పట్టణం యొక్క సౌందర్యాన్ని చూసి, తాను వచ్చిన కార్యాన్ని మరిచిపోకుండా ఉండాలని, హనుమంతుడు ఆ నగరం యొక్క సౌందర్యాన్ని చూస్తున్నప్పుడు సీతమ్మని కనిపెట్టాలనే విషయాన్ని మనస్సులో బలంగా పెట్టుకొని ఉన్నాడు). ఆ రాక్షసుల ఇళ్లన్నీ వెతికిన తరువాత హనుమంతుడు మెల్లగా రావణ అంతఃపురంలోకి ప్రవేశించాడు.

వాల్మీకి రామాయణం 236 వ భాగం, సుందరకాండ

ఆ లంకా పట్టణంలో ఉన్నవాళ్లు దీక్షితులు, కొంతమంది తల మీద వెంట్రుకలన్ని తీయించుకున్నారు, కొంతమంది ఎద్దు చర్మాలు కట్టుకొని ఉన్నారు, కొంతమంది దర్భలని చేతితో పట్టుకొని ఉన్నారు, కొంతమంది అగ్నిగుండాలని చేతితో పట్టుకొని ఉన్నారు. ఒకడు పక్కవాడికి తన ఛాతిని చూపిస్తున్నాడు, కొంతమంది తమ శరీరాలని కనపడ్డ స్త్రీల మీద పడేస్తున్నారు, కొంతమంది ఎప్పుడూ తమ చేతులలో పెద్ద పెద్ద శూలాలు పట్టుకొని ఉన్నారు, కొంతమంది పరస్పరం ఒకడిని ఒకడు తోసుకుంటూ ఉన్నారు, తమ భుజాల బలాలని చూపించుకుంటు ఉన్నారు, ఒకడిని మరొకడు అధిక్షేపించుకుంటు మాట్లాడుకుంటున్నారు. ఆ లంకలో ఒకడు శూలం పట్టుకొని, ఒకడు ముద్గరం, ఒకడు పరిఘ, అలా రకరకములైన ఆయుధములు పట్టుకొని ఉన్నారు.

అక్కడున్న రాక్షసుల పేర్లు ఏంటంటే, ప్రహస్త, కుంభకర్ణ, మహొదర, విరూపాక్ష, విద్యున్మాలి, వజ్రదంష్ట, సుఖ, సారణ, ఇంద్రజిత్, జంబుమాలి, సుమాలి, రస్మికేతు, సూర్యకేతు, వజ్రకాయ, ధూమ్రాక్ష, భీమ, ఘన, హస్తిముఖ, కరాళ, పిశాచ, మత్త, ధ్వజగ్రీవ, సుకనాస, వక్ర, శట, వికట, బ్రహ్మకర్ణ, దంష్ట్ర, రోమస.

హనుమంతుడు ఆ రాక్షసుల అందరి ఇళ్ళల్లోకి వెళ్ళి సీతమ్మ కోసం వెతికారు, ఆ సమయంలో రాక్షస స్త్రీలు తమ భర్తలతో కలిసి ఆనందాన్ని పొందుతున్నారు.  

ఆ స్త్రీలందరినీ చూసిన హనుమంతుడు అనుకున్నాడు ” మా అమ్మ సీతమ్మ ఇలా ఉండదు. మా సీతమ్మ కనిపించి కనపడకుండా ఉండే చంద్రరేఖలా ఉంటుంది, మట్టిపట్టిన బంగారు తీగలా ఉంటుంది, బాణపు దెబ్బ యొక్క బాధలా ఉంటుంది, వాయువు చేత కొట్టబడ్డ మేఘంలా ఉంటుంది ” అంటూ, ఆ లంకా పట్టణాన్ని వెతుకుతూ రావణాసురుడి యొక్క ప్రాసాదం దెగ్గరికి వెళ్ళాడు.

 

వాల్మీకి రామాయణం 235 వ భాగం, సుందరకాండ

అప్పుడు ఆవిడ అనింది ” నేను అనుమతి ఇవ్వడం కాదు, నన్ను గెలిచినవాడు మాత్రమే లోపలికి వెళ్ళగలడు. నువు లోపలికి వెళ్ళడానికి వీలులేదు ” అనింది.

” సరే ఇంతకీ నువ్వు ఎవరు? ” అని హనుమంతుడు ఆ స్త్రీని ప్రశ్నించాడు.

అప్పుడామె ” నేను లోపలున్న మహాత్ముడైన రావణుడి పనుపున ఈ లంకా పట్టణానికి కాపలా కాస్తుంటాను ” అని చెప్పి చట్టుకున్న హనుమంతుడిని తన చేతితో ఒక దెబ్బ కొట్టింది.

ఆ దెబ్బకి హనుమంతుడికి ఎక్కడలేని కోపం వచ్చింది. కుడి చేతితో కొడితే ఈమె చనిపోతుందని, తన ఎడమ చేతితో ఆమెని ఒక్క గుద్దు గుద్దాడు. ఆ దెబ్బకి ఆమె కళ్ళు తేలేసి కిందపడిపోయింది.

అప్పుడామె అనింది ” నన్ను లంక అంటారు. నువ్వు నన్ను గెలిచావు, నేను ఈ రావణాసురుడి బాధ భరించలేకపోతున్నాను, కొన్ని వేల సంవత్సరాల నుండి నన్ను విసిగిస్తున్నాడు. ‘ ఒక వానరుడు వచ్చి నిన్ను గెలిచిననాడు, నీకు ఈ రావణుడి గొడవ వదిలిపోతుంది ‘ అని బ్రహ్మగారు నాకు వరం ఇచ్చారు. ఇప్పుడు నాకు అర్ధమయ్యింది, ఈ లంకలోని రాక్షసుల పని, రావణుడి పని అయిపోయింది. ఇక నువ్వు లోపలికి వెళ్ళి సీతమ్మని కనిపెట్టు ” అని రాజద్వారం తెరిచింది.

అప్పుడు హనుమంతుడు అక్కడున్న గోడమీద నుంచి ఎగిరి లోపలికి ఎడమకాలు పెట్టి దూకాడు. లోపలికి వెళ్ళి ఆ లంకా పట్టణాన్ని చూడగా, ఇది గంధర్వ నగరమా అన్నట్టుగా ఉంది. అక్కడున్న మేడలు, స్తంభాలు బంగారంతో చెయ్యబడి ఉన్నాయి. అన్నిటికీ నవరత్నాలు తాపడం చెయ్యబడి ఉన్నాయి. స్ఫటికములతో మెట్లు కట్టబడి ఉన్నాయి. ఎక్కడ చూసినా దిగుడుబావులు, సరోవరాలతో ఆ ప్రాంతం సోభిల్లుతుంది. ఆ ప్రాంతం చెట్లతో, పక్షులతో, పళ్ళతో, నెమళ్ళ అరుపులతో, ఏనుగులతో, బంగారు రథాలతో అత్యంత రమణీయంగా ఉంది. ఆ రాత్రి పూట ఆకాశంలో ఉన్న చంద్రుడు వెన్నెల కురిపిస్తూ, లోకం యొక్క పాపం పోగొట్టేవాడిలా ఉన్నాడు. ఆ చంద్రుడి ప్రకాశంతో హనుమంతుడు ఆ లంకా పట్టణంలోని వీధులలో సీతమ్మ కోసం వెతుకుతున్నాడు.

 

వాల్మీకి రామాయణం 234 వ భాగం, సుందరకాండ

ధృతి-దృష్టి-మతి-దాక్ష్యం అనే ఈ నాలుగింటిని ఎవరు తమ పనులలో కలుపుకుంటున్నారో వారికి జీవితంలో ఓటమి అన్నది లేదు అని వాల్మీకి మహర్షి చెప్పారు. ధృతి అంటె పట్టుదల, దృష్టి అంటె మంచి బుద్ధితో ఆలోచించగల సమర్ధత, మతి అంటె బుద్ధితో నిర్ణయించవలసినది, దాక్ష్యం అంటె శక్తి సామర్ధ్యాలు.

ఆ పర్వతం మీద దిగిన హనుమంతుడు విశ్వకర్మ నిర్మితమైన లంకా పట్టణం యొక్క సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఈ లంకా పట్టణాన్ని సొంతం చేసుకోవడం ఆ దేవతల వల్ల కూడా కాదు అని అనుకొని, ఈ రూపంతో సీతమ్మని వెతకడం కష్టం కనుక పిల్లంత రూపంలో సీతమ్మని వెతుకుతాను అనుకున్నాడు. చీకటి పడ్డాక ఆయన పిల్లంత స్వరూపాన్ని పొంది లంక యొక్క రాజద్వారము దెగ్గరికి వెళ్ళాడు.

అక్కడికి వెళ్ళేసరికి వికటాట్టహాసం చేస్తూ పర్వతం అంత ఆకారంతో ఒక రాక్షస స్త్రీ కనపడింది. ఆమె హనుమంతుడిని చూడగానే ” నువ్వు ఎవరు?. అరణ్యములలో తిరిగే కోతివి, నీకు ఇక్కడ పనేంటి? ఇక్కడికి ఎందుకొచ్చావు? ” అని అడిగింది.

హనుమంతుడు అన్నాడు ” ఓ వికృతమైన కన్నులున్నదాన! నేను ఎందుకు వెళుతున్నానో తెలుసా? ఒకసారి ఆ వనాలని, ఉపవనాలని, చెట్లని, భవనాలని, సరస్సులని చూసి వచ్చేస్తాను. నాకు అనుమతి ఇవ్వు ” అన్నాడు.