వాల్మీకి రామాయణం 394 వ భాగం, యుద్ధకాండ
సుగ్రీవుడు, విభీషణుడు, అంగదుడు మొదలైన వానర వీరులందరికీ బహుమతులు ఇచ్చారు. హనుమంతుడికి తెల్లటి వస్త్రముల ద్వయం, హారాలు ఇచ్చారు.
ఆ సమయంలో, సీతమ్మ తన మెడలో ఉన్న ఒక హారాన్ని తీసి చేతిలో పట్టుకుంది. అప్పుడు రాముడు సీత వంక చూసి ” ఈ హారాన్ని ఎవరికి ఇస్తావో తెలుసా. పౌరుషము, బుద్ధి, విక్రమము, తేజస్సు, వీర్యము, పట్టుదల, పాండిత్యము ఎవడిలో ఉన్నాయో, అటువంటివాడికి ఈ హారాన్ని కానుకగా ఇవ్వు, అన్నిటినీమించి వాడు నీ అయిదోతనానికి కారణం అయ్యి ఉండాలి ” అన్నాడు.
అప్పుడు సీతమ్మ ఆ హారాన్ని హనుమంతుడికి ఇచ్చింది. అప్పుడాయన ఆ హారాన్ని కన్నులకు అద్దుకొని మెడలో వేసుకున్నాడు.
ఎప్పుడైతే ధర్మాత్ముడైన రాముడు సింహాసనం మీద కూర్చున్నాడో, అప్పుడు ఎవరినోట విన్నా’ రాముడు, రాముడు ‘ తప్ప, వేరొక మాట వినపడలేదు. రాముడు రాజ్యం చేస్తుండగా దొంగల భయం లేదు, శత్రువుల భయం లేదు, నెలకి మూడు వానలు పడుతుండేవి, భూమి సస్యశ్యామలంగా పంటలని ఇచ్చింది, చెట్లన్నీ ఫలపుష్పములతో నిండిపోయి ఉండేవి, చాతుర్వర్ణ ప్రజలు తమ తమ ధర్మములయందు అనురక్తులై ఉన్నారు, చిన్నవాళ్ళు మరణిస్తే పెద్దవాళ్ళు ప్రేతకార్యం చెయ్యడం రామ రాజ్యంలో లేదు. ఆ రాముడి పరిపాలనలో అందరూ సంతోషంగా ఉండేవారు.
రామాయణం యొక్క ఫలశ్రుతి
ఎక్కడెక్కడ రామాయణం చెబుతున్నప్పుడు బుద్దిమంతులై, పరమ భక్తితో రామాయణాన్ని ఎవరైతే వింటున్నారో అటువంటివారికి శ్రీ మహావిష్ణువు యొక్క కృప చేత తీరని కోరికలు ఉండవు. ఉద్యోగం చేస్తున్నవారు, వ్యాపారం చేస్తున్నవారు ఆయా రంగములలో రాణిస్తారు. సంతానం లేని రజస్వలలైన స్త్రీలు ఈ రామాయణాన్ని వింటె, వాళ్ళకి గొప్ప పుత్రులు పుడతారు, తమ బిడ్డలు వృద్ధిలోకి వస్తుంటే చూసుకొని ఆ తల్లులు ఆనందం పొందుతారు. వివాహము కానివారికి వివాహము జెరుగుతుంది, కుటుంబం వృద్ధిలోకి వస్తుంది, వంశము నిలబడుతుంది, మంచి పనులకి డబ్బు వినియోగం అవుతుంది, దూరంగా ఉన్న బంధువులు తొందరలో వచ్చి కలుసుకుంటారు, ఇంటికి మంగళతోరణం కట్టబడుతుంది, ఎన్నాళ్ళనుంచో జెరగని శుభకార్యాలు జెరుగుతాయి, పితృదేవతలు సంతోషిస్తారు.
వాల్మీకి రామాయణం 393 వ భాగం, యుద్ధకాండ
ప్రతి ఇంటిమీద పతాకాలు ఎగురవేశారు, అన్ని ఇళ్ళముందు రంగవల్లులు వేశారు, సంతోషపడిపోతూ, నాట్యం చేస్తూ అందరూ వెళుతున్నారు. ఆ వెళ్ళేటప్పుడు ముందుగా మంగళ వాయిద్యాలు నడిచాయి, ఆ వెనకాల వేద పండితులు నడిచారు, తరువాత పెద్దలు, వాళ్ళ వెనకాల కన్నె పిల్లలు, కొంతమంది స్త్రీలు పిండివంటలు పట్టుకుని నడిచారు. మార్గమధ్యంలో గంధపు నీరు జల్లుకుంటూ వెళ్ళారు. ఆ తరువాత సువాసినులు అయిన స్త్రీలు చేతులలో పువ్వులు, పసుపు, కుంకుమ పట్టుకుని వెళ్ళారు. వశిష్ఠుడు, జాబాలి, కాశ్యపుడు, గౌతముడు మొదలైన ఋషులందరూ వచ్చారు. అలా అందరూ కలిసి అయోధ్యకి చేరుకున్నారు. ఆ రాత్రికి అయోధ్యలో గడిపాక మరునాడు రాముడి పట్టాభిషేకానికి 4 సముద్ర జలాలు, 500 నదుల జలాలని వానరాలు తీసుకొచ్చాయి. ఇంద్రుడు నూరు బంగారు పూసలు కలిగిన మాలని రాముడికి బహూకరించాడు.
వానరాలు తీసుకోచ్చిన ఆ జాలలని రాముడి మీద పోసి ఆయనకి పట్టాభిషేకం చేశారు. కిరీటాన్ని తీసుకొచ్చి రాముడి శిరస్సున అలంకారం చేశారు. ఆ సమయంలో రాముడు కొన్ని కోట్ల బంగారు నాణాలు, లక్షల ఆవులు, వేల ఎద్దులు దానం చేశాడు.
అప్పుడు రాముడు లక్ష్మణుడితో ” లక్ష్మణా! యువరాజ పట్టాభిషేకం చేసుకో ” అన్నాడు.
అప్పుడు లక్ష్మణుడు ” అన్నయ్య! నాకన్నా పెద్దవాడు భరతుడు ఉన్నాడు. నాకు రాజ్యం వద్దు, భరతుడికి ఇవ్వు ” అన్నాడు.
తరువాత యువరాజ పట్టాభిషేకం భరతుడికి జెరిగింది.
శ్రీమతే రామానుజాయ నమః
“తృష్ణాతోయే మదన పవనోద్ధూతమోహోర్మిమాలే
దారావర్తే తనయ సహజగ్రాహ సంఘాకులే చ |
సంసారాఖ్యే మహతి జలధౌ మజ్జతాం నస్త్రిధామన్
పాదాంభోజే వరద భవతో భక్తినావం ప్రయచ్ఛ ||”
“ఓ త్రిధాముడా! తృష్ణ అనే ఉదకములు(ఆశ అనే జలములు) కలది,అటువంటి ఆశలు మన్మథుడు అనే గాలిచేత కదులుతూ,సకల మోహములలో పడి,సంసారం అనే ఉచ్చులో పడి ఇందులో దాటే ఉపాయం లేక మునిగిపోతున్న మాకు ఓ వరదా!నీ పాదభక్తి అనే నౌకను మాకు అనుగ్రహించి దరిచేర్చండి. “
భక్తి అనేది కలగడానికి ప్రధానమైనది మనస్సు,అది చంచలమైనది, ఇంద్రియములకు అధిపతి అయినవాడు ‘హృషీకేశుడు’ – హృషీకాణాం ఈశః ఇంద్రియములకు ఈశుడు.శరీరములందు క్షేత్రజ్ఞ (జీవ) రూపమున నుండి ఇంద్రియములను తమ తమ విషయములయందు ప్రవర్తిల్ల జేయువాడు.
“నమో నమోऽనిరుద్ధాయ హృషీకేశేన్ద్రియాత్మనే ।
నమః పరమహంసాయ పూర్ణాయ నిభృతాత్మనే ॥ “
లేదా ఎవరి ఇంద్రియములు అందరి జీవులకువలె తమ తమ విషయములందు ప్రవర్తించకుండా తన వశము నందుండునో అట్టి పరమాత్ముడు హృషీకేశుడు.
“సూర్య రశ్మిర్హరికేశాః పురస్తాత్ సూర్యుని కిరణము హరికి సంబంధించు కేశమే అను శ్రుతి వచనము “
సూర్య చంద్రులును కేశములుగా (కిరణములు) గల విష్ణువు హృషీకేశుడని చెప్పబడును.
అలాంటి పరమాత్మ యొక్క పాదపద్మములయందు మన భక్తిని సమర్పిస్తే సంసారసాగరమనే ఈ అగాధం నుండి దాటడానికి నావని ప్రసాదిస్తాడు.నావ అంటే తన యొక్క సాన్నిధ్యాన్ని పొందింపచేసే పరమాత్మ అనుగ్రహమే మనకు నావ.
సంసారవృక్ష చ్ఛేదనమునకు భగవంతుడి యందు సంగము,మిగిలినవాటి యందు అసంగము అనే శస్త్రము కావాలంటే అది భగవంతుడే ప్రసాదించాలి అని శరణాగతి చేసినచో భగవంతుడే దానిని కృప చేయును.
ఈ రీతిగా ఆశ మితీరిన పక్షంలో అనర్ధములకు మూలమవుతుంది. ఆ ఆశాజలముల వల్ల గాలి అలలు కలిగి స్వాధీనము తప్పి,మన్మథవికారములు కలుగుతాయి.భార్య అను బంధము వల్ల ఏర్పడ్డ మరిన్ని బంధములు పిల్లలు బంధువులు ఇలా సహజన్ములయొక్క భాధ కలుగుతుంది. అటువంటి బాధను తొలగించుకోడానికి పరమాత్మ యొక్క పాదభక్తి ఒక్కటే శరణ్యము అంటూ మన కులశేఖరాళ్వార్లు ఉపాయమును తెలియజేస్తున్నారు.
నిత్య శ్రీ: నిత్య మంగళం.
అడియేన్ రామానుజ దాసన్.
వాల్మీకి రామాయణం 392 వ భాగం, యుద్ధకాండ
శత్రుఘ్నుడు అక్కడికి వచ్చి ” అన్నయ్య! క్షుర కర్మ చేసేవారిని తీసుకొచ్చాను, నీ జుట్టు జటలు పట్టేసింది కదా అందుకని క్షుర కర్మ చేయించుకో ” అన్నాడు.
అప్పుడు రాముడు ” నేను తండ్రిమాట నిలబెట్టడం కోసమని నా అంత నేనుగా అరణ్యవాసానికి వెళ్ళాను. కాని, తండ్రి ఆజ్ఞాపించకపోయినా, నాయందున్న ప్రేమ చేత స్వచ్ఛందంగా తనంత తాను దీక్ష స్వీకరించి, నా పాదుకలని తీసుకెళ్ళి సింహాసనంలో పెట్టి, 14 సంవత్సరములు రాజ్యమునందు మమకారము లేకుండా పరిపాలించిన భరతుడు ముందు దీక్ష విరమించి స్నానం చేస్తే తప్ప నేను దీక్షని విరమించను ” అన్నాడు.
భరతుడు, శత్రుఘ్నుడు, సుగ్రీవుడు, విభీషణుడు క్షుర కర్మ చేయించుకుని మంగళస్నానం చేశాక రాముడు క్షుర కర్మ చేయించుకుని మంగళ స్నానం చేశాడు. తరువాత రాముడు అందమైన పట్టుపుట్టములను ధరించి, మంచి అంగరాగములను పూసుకొని, దివ్యాభరణములను ధరించి బయటకి వచ్చాడు.
తన కొడుకు ఇన్నాళ్ళకి తిరిగొచ్చాడని పొంగిపోయిన కౌసల్యా దేవి సీతమ్మకి అభ్యంగన స్నానం చేయించి, మంచి పట్టుపుట్టం కట్టి చక్కగా అలంకరించింది. కౌసల్య, సుమిత్ర, కైకేయల చేత అలంకరింపబడ్డ వానర కాంతలు 9000 ఏనుగుల్ని ఎక్కారు. దశరథుడు ఎక్కే శత్రుంజయం అనే ఏనుగుని తీసుకొచ్చి దానిమీద సుగ్రీవుడిని ఎక్కించారు. వానరులందరూ కూడా సంతోషంగా అయోధ్యకి బయలుదేరారు. సూర్యమండల సన్నిభమైన రథాన్ని రాముడు ఎక్కాడు, ఆ రథం యొక్క పగ్గములను భరతుడు పట్టుకొని నడిపించాడు. లక్ష్మణుడు నూరు తీగలు కలిగిన తెల్లటి గొడుగుని పట్టాడు. ఒకపక్క శత్రుఘ్నుడు మరొకపక్క విభీషణుడు వింద్యామర వేస్తున్నారు. అలా రథంలో అయోధ్యకి వెళుతున్న రాముడు కనపడ్డ వాళ్ళందరినీ పలకరించుకుంటూ వెళ్ళాడు.
శ్రీమతే రామానుజాయ నమః
“భవజలధిమగాధం దుస్తరం నిస్తరేయం
కధమహమితి చేతో మాస్మగా: కాతరత్వం |
సరసిజదృశి దేవే తావకీ భక్తిరేకా
నరకభిది నిషణ్ణా తారయిష్యత్యవశ్యం ||”
ఓ మనసా! దాటటానికి దుస్సాధ్యమై అగాధమైన ఈ సంసార సాగరాన్ని నేను ఎలా దాటగలను అని కంగారుపడకు. శ్రీహరి పాద పద్మాలమీద స్థిరమైన భక్తిని అలవరచుకుంటే ఆ భక్తి ఒక్కటే నరక యాతనల నుంచి, సంసార సాగరం నుంచి రక్షిస్తుంది.
మనసా! పరమాత్మ పరమ కారుణికుడు కాబట్టే మన ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి తన యందు లయం చేసుకోవాలనే తలంపుతోటి ఆ స్వామీ నిన్ను నాకు దయ చేసాడు.మనస్సును సాధనంగా చేసుకుని తరించమని పరమాత్మ యొక్క అభిప్రాయం.
‘ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ |
ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవరిపురాత్మనః || ‘
మనస్సును బంధువుగా చేసుకుని సుఖపడాలి అనే తలంపు తోనే నిన్ను ఆ పరమాత్మ కరుణించెను.కాబట్టి నిన్ను సమర్పిస్తే పరమాత్మ నన్ను సంసారసాగరమును దాటిస్తాడు.
‘భవజలధిమగాధం దుస్తరం నిస్తరేయం’- సంసారసాగరమనే ఈ సముద్రం చాలా గంభీరమైన అగాధం,మనమే దాటగలం అనే యోచన కూడా చేయశక్యం కానిది.
‘కధమహమితి’ ఇలాంటి కష్టతరమైన భవసాగరాన్ని ఎలా దాటుతానో అని
‘చేతః’- మనసా, ‘కాతరత్వం’-పిరికితనాన్ని, ‘మా స్మగా:పొందకు,అధైర్యం చెందకు.
‘సరసిజదృశి దేవే తావకీ భక్తిరేకా ‘ తామరపుష్పముల యొక్క రేకులవలె ఉండే కోటి సూర్య ప్రకాశితమైన నేత్రాల యొక్క దివ్య సౌందర్యమును చూసినా చాలు, అంతేనా చరాచర ప్రపంచానికి జ్ఞానమును ప్రసాదించి మోక్షమనే లీలను ఇవ్వగలిగినవాడు,బ్రహ్మాదిదేవతలకు శరణు ఇచ్చిన వాడు, నరకాంతకుడు,అలాంటి వాడిని శరణు పొందిన తరవాత పాప భీతి ఇక ఉండదు.భక్తి ఒక్కటే చాలు.
నిత్య శ్రీ: నిత్య మంగళం.
అడియేన్ రామానుజ దాసన్.
వాల్మీకి రామాయణం 391 వ భాగం, యుద్ధకాండ
రాముడు పుష్పక విమానం నుంచి కిందకి దిగగానే భరతుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్నగారి పాదాలకి పాదుకలు తొడిగాడు. ఇది చూసి సుగ్రీవ విభీషణులు కన్నుల నీళ్ళు కారాయి. వెంటనే భరతుడు సుగ్రీవుడిని కౌగలించుకొని ” ఇంతకముందు మేము నలుగురము, ఇవ్వాల్టి నుంచి మనం అయిదుగురము అన్నదమ్ములము సుగ్రీవ ” అన్నాడు. తరువాత అక్కడున్న గంధమాదుడిని, మైందుడిని మొదలైనవారిని భరతుడికి పరిచయం చేశారు. అప్పుడు భరతుడు ఆ వానరాలని ‘ మీరు మా అన్నయ్యకి సహాయం చేశారు, మీరు ఎంత మంచివారు ‘ అని అందరినీ కౌగలించుకున్నాడు.
పుష్పకం నుంచి కిందకి దిగిన వానరకాంతలు వాళ్ళ ప్రేమలని, వాళ్ళ అలంకారాలని చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు అక్కడికి వచ్చిన కౌసల్య, కైకేయ, సుమిత్రలు అన్నారు ” ఈ వానర కాంతలందరికి మేమే తలస్నానాలు చేయిస్తాము ” అని, వాళ్ళందరికీ తలస్నానం చేయించారు.
తరువాత రాముడు ఆ పుష్పక విమానాన్ని ” కుబేరుడి దెగ్గరికి వెళ్ళిపో ” అని ఆజ్ఞాపించాడు. అప్పుడా ఆ పుష్పకం కుబేరుడి దెగ్గరికి వెళ్ళిపోయింది.
అప్పుడు భరతుడు శిరస్సున అంజలి ఘటించి రాముడితో ” మా అమ్మ అయిన కైకేయి ఆనాడు రెండు వరాలు అడిగింది. ఇక్ష్వాకు వంశంలో పెద్దవాడిగా పుట్టి, రాజ్యం పొందడానికి సమస్త అర్హతలు కలిగి ఉన్న నువ్వు, తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసం రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావు. నీ పాదుకలని న్యాసంగా ఇచ్చి నన్ను రాజ్యం చెయ్యమన్నావు. నువ్వు నాకు రాజ్యాన్ని ఎలా ఇచ్చావో, అలా ఆ రాజ్యాన్ని తీసుకొచ్చి నీ పాదాల దెగ్గర పెట్టేస్తున్నాను. నీకు ఉన్నదానిని నాకు ఇచ్చి, నేను దానిని అనుభవిస్తుంటే చూసి నువ్వు మురిసిపోయావు, అందుకని ఇవ్వాళ నేను దానిని నీకు ఇచ్చేస్తున్నాను ” అన్నాడు.
భరతుడి మాటలకి సంతోషించిన రాముడు తిరిగి రాజ్యాన్ని స్వీకరించడానికి అంగీకరించాడు.
శ్రీమతే రామానుజాయ నమః
“భవజలధిగతానాం ద్వంద్వవాతాహతానాం
సుతదుహితృకళత్ర త్రాణభారార్దితానాం |
విషమవిషయతోయే మజ్జతామప్లవానాం
భవతు శరణమేకో విష్ణుపోతే నరాణాం ||”
సంసారమనే సముద్రంలో చిక్కి విరుద్ధ ధర్మములనే గాలిచే కొట్టబడి,పుత్రకళత్రాదుల రక్షణభారమని బరువును మోస్తూ, విషయసుఖాలనే నీళ్ళలో మునిగి లేస్తూ,నావ లేకుండా నానా యాతనలకు గురి అవుతున్న నరులకు శ్రీమన్నారాయణుడు అనే నావ ఒక్కటే శరణ్యము.
ఓ మనసా!’భవజలధిగతానాం’ భవ అంటే సంసారం,జలధి అంటే సముద్రం ప్రయాసతో కూడినది,గతానాం అంటే పడుట,సంసారమనే అగాధంలో తెలియక దిగాము,తిరిగి గట్టు ఎక్కుదామని ప్రయత్నిస్తుండగా ‘ ద్వంద్వవాతాహతానాం’శీతలము ఉష్ణములనే అనే సుఖదుఃఖములు అను జంట గాలులు కొట్టడం ప్రారంభంచేశాయి.
మరి వివాహ సమయమున తెలియలేదా అంటావేమో? మేళతాళములు,విందుభోజనములు,బంధుదర్శనములు మొదలైన సంబరములలో పడి ఇందులో ఉన్న లోతులు తెలియలేదు.అలా మొదలైన తరవాత సుఖదుఃఖములనే గాలులు మొదలైతే కూడా గట్టు ఎక్కడానికి శ్రమ అయినా సహించి ఎక్కడానికి ప్రయత్నిస్తుండగా, నేనే ఎక్కలేకపోతుంటే నామీద మరింత భారము పడింది ‘సుతదుహితృకళత్ర’ భార్యాపుత్రాదులను కాపాడటం అనే భారము తలమీద ఉంచుకోడం వల్ల శ్రమపెరిగి నడవవలసి వచ్చింది. ఆ భారము ఉంచుకుని నిలబడడానికి వీలులేదు.
మునిగితే మాత్రం ఏమిటి అంటావేమో మనసా?
‘గ్రహణ సమయంలో సముద్రస్నానం చేయలేదా అంటే నేను అలాంటి స్థలములో మునగలేదు ఉచితమైన స్థలములలో మునిగితే భయము లేదు,నేను దిగినది పూడుకుపోయే స్థలము.’
“విషమవిషయతోయే మజ్జతామప్లవానాం” విషకరమైన విషయములు అంటే ఇంద్రియాది సుఖములు అనే వాటిలో మునిగాను. విషయవాంఛ అనేది ఉండకూడదా అంటే ఉండవచ్చు భగవద్విషయములైతే తరించడానికి,అనుభవించడానికి ఇంద్రియములు అనుభవింపబడుటకు విషయములను పరమాత్మ దయచేసి ఉన్నాడు.
“ప్రసాదే సర్వదుఃఖానాం హాని రస్యోపజాయతే |
ప్రసన్నచేతసో హ్యశు బుద్ధి: పర్యవతిష్ఠతే ||”
పై శ్లోకంలో వలె రాగద్వేషములను త్యజించి విషయములను అనుభవించాలి. కానీ నేను అలాంటి విషయములలో మునగలేదు విషతుల్యములైన విషయాల్లో మునిగాను.
“యతతో హ్యాపీ కౌంతేయ పురుషస్య విపశ్చితః |
ఇంద్రియాణి ప్రమాధీవి హరంతి ప్రసభం మనః ||”
ఇంద్రియాలనేవి మంచి విషయాలందు ప్రవేశించే స్వభావము లేదు.అవి లౌకికమైన మనల్ని పాడు చేయు విషయముల యందే పోవును.
మరి ఇలాంటి సంసారమనే అగాధపు సముద్రములో దిగేటప్పుడు ఓడని ఏమైనా సహాయార్ధం చూసుకున్నావా?అంటే,
మనసా!ఈ రీతిలో అల్లాడే నరులందరికి ‘భవతు శరణమేకో విష్ణుపోతే నరాణాం’ విష్ణువు అనే నావ మాత్రమే శరణము. కాబట్టి ఓ మనసా!నువ్వు ఎల్లప్పుడూ ఆ పరమాత్మ యొక్క పాదముల వద్దనే స్మరించుతూ ఉండుము.అప్పుడు నాకు కూడా ఆ నావ లభిస్తుంది. నా యొక్క నిశ్చలమైన భక్తి కలిగిన మనస్సును కనుక అతనికి అర్పిస్తే దానినే కూలీగా తీసుకుని తన దయ చేత మనల్ని తరింపచేస్తాడు. వేరు ఏమి ఆయనకు ఇవ్వలేము ఎందుకంటే నిత్యపరిపూర్ణుడు కేవలము మనస్సును మాత్రమే ఇవ్వగలము.ఇలా సంసారసాగరమున పడి అందులో కలిగే బాధలను అనుభవించే నరులకు పరమాత్మ అయినా శ్రీమహావిష్ణువనే ఓడయే శరణమవుతుంది అంటూ వివరిస్తారు మన కులశేఖరాళ్వార్లు.
నిత్య శ్రీ: నిత్య మంగళం.
అడియేన్ రామానుజ దాసన్.
వాల్మీకి రామాయణం 390 వ భాగం, యుద్ధకాండ
మరునాడు ఉదయం రాముడు బయలుదేరబోయేముందు భారద్వాజుడు అన్నాడు ” నీ ధర్మానుష్టానికి నాకు ప్రీతి కలిగింది రామ. నీకొక వరం ఇస్తాను, ఏదన్నా కోరుకో ” అన్నాడు.
అప్పుడు రాముడు ” వానరములు ఎక్కడ ఉంటాయో అక్కడ ఫలసంవృద్ధి ఉండాలని నేను కోరాను. ఇప్పుడు ఇక్కడినుంచి 3 యోజనముల దూరం వరకూ అయోధ్యకి ప్రయాణిస్తాము. ఆ మార్గంలో కూడా చెట్లన్నీ ఫల పుష్పభరితములై, తేనెపట్లతో తేనెలు కారుతూ ఉండాలి ” అని అడిగాడు.
తరువాత భారద్వాజుడి దెగ్గర సెలవు తీసుకొని పెద్ద కోలాహలంతో నందిగ్రామానికి రాముడు చేరుకున్నాడు.
అప్పుడు భరతుడు తన సైనికులతో ” రాముడు వచ్చేస్తున్నాడు, అయోధ్యలో ఉన్న తల్లులని తీసుకురండి, రథాలని తీసుకురండి, పెద్దవాళ్ళని తీసుకురండి, అందరినీ అయోధ్యకి రమ్మనండి. అంతటా పసుపు నీరు, గంధపు నీరు జల్లించండి. దివ్యమైన ధూపములు వెయ్యండి. అందరమూ కలిసి రాముడిని నందిగ్రామం నుంచి అయోధ్యకి పట్టాభిషేకానికి తీసుకువెళదాము ” అని భరతుడు ఆజ్ఞాపించాడు.
రాముడు వచ్చేస్తున్నాడన్న విషయం తెలుసుకున్న అయోధ్య వాసులు పరుగు పరుగున నందిగ్రామానికి వచ్చారు.
శ్రీమతే రామానుజాయ నమః
“మాభీర్మందమనో విచింత్య బహుధా యామీశ్చిరం యాతనాః
నామీ నః ప్రభవంతి పాపరిపవః స్వామీ నను శ్రీధరః |
ఆలస్యం వ్యపనీయ భక్తిసులభం ధ్యాయస్వ నారాయణం
లోకస్య వ్యసనాపనోదనకరో దాసస్య కిం న క్షమః ||”
ఓ మందమనసా! యమయాతనలను పలురకాలుగా భావించి భయపడకు,ఆ శత్రువులు మనల్ని ఏమి చెయ్యలేరు.శ్రీధరుడు కదా మనకు స్వామీ! భక్తసులభుడు అగు శ్రీమన్నారాయణుడిని ఆలస్యము చేయకుండా ధ్యానించుము.లోకములో ఉండే సమస్త వ్యసనములను పోగొట్టువాడు దాసుడిని సరిదిద్దలేడా?
“కులశేఖరాళ్వార్లు నిరంతరం పరమాత్మను స్మరించమని వారి దివ్య పాదముల వద్దు వదులుతున్నాను అని అక్కడ రక్షణ,సౌఖ్యము అన్ని కలుగుతాయని చెప్పగా మనస్సుకు కొంత ధైర్యం కలిగింది కానీ సంపూర్ణ నమ్మకం కలగలేదు.”
అలా చేరిన మనస్సుకు కలిగిన భయములేంటంటే’బహుధా యామీశ్చిరం యాతనాః’ ఓ కులశేఖరా నేను దుష్టుడను,నన్ను నమ్మితే నువ్వు కుంభీపాకం అనే దాని పడతావు,చెడిపోయిన నాకు సుఖము లేదు,అంతేకాక నన్ను నమ్మిన నిన్ను నరకం లో పడేస్తే నీతో పాటు నేను రావలసిందే అంటూ భయము కలుగుతోందట.
కులశేఖరాళ్వార్లు ‘మాభీర్మందమనో విచింత్య’ కొంచెము కూడా జ్ఞానం లేని మనసా! నువ్వు అవన్నీ తలుచుకుంటూ కాలాన్ని వ్యర్థం చేయకు,అసలు నాకు నరకం అనేది వస్తే కదా నువ్వు నాతో నరకానికి వచ్చేది. నేను వెళ్లే స్థలము అత్యంత ఆనందదాయకమైనది కాబట్టి నువ్వు కూడా సుఖపడతావు. నేను చెప్పేది ని హితముకై అని భావించవచ్చు కదా! నిన్ను వెళ్ళమంటున్నది నీవు జన్మించిన స్థానముకే నిన్ను నియమించిన పరమాత్మ అయినా ప్రభువు వద్దకే కదా!. దేని మీద ని అనుమానము?
‘నామీ నః ప్రభవంతి పాపరిపవః’ పాపములు అనే శత్రువులు నేను హరి స్మరణలో ఉంటే మల్లి నన్ను మార్చి నరకములో పడేయడానికి(కామక్రోధలోభమోహమదమాశ్చర్యాలు అనే శత్రువులు) ప్రయత్నిస్తారు,నన్ను అలా తిరిగి లౌకిక వాంఛలవైపు ఈడుస్తే ఎలా?
ఓ అదా నీ భయం ‘స్వామీ నను శ్రీధరః’ – మనసా! మన వెంట ఉన్నవాడు సామాన్యమైన వాడనుకుంటున్నావేమో! శ్రీధరుడు మన అందరికి తల్లి అయినా అలాగే మన పాపములను దాచి మనల్ని మార్చి పురుషకారం వహించే లక్ష్మి దేవిని తన యొక్క వక్షస్థలములో కలిగినటువంటి పరమాత్మ,కాబట్టి అక్కడ అంటా సుఖమే ఉందును భయములకు తావులేదు.
పరమాత్మకు మనము ఏమి ఇవ్వాలని అంటావేమో ‘ఎప్పుడైనా పెద్దల వద్దకు వెళ్తుంటే వట్టి చేతులతో వెళ్ళకూడదు అనే నియామయున్నది అలా అని ఏదిపడితే అదికాకుండా వారికి ప్రియమైనది ఇస్తే వారు అనుగ్రహం మనయందు ఉంటుంది. మరి పరమాత్మకు ప్రీతి కలిగేది ఏముంటుంది అంటే మన యొక్క నిస్వార్థమైన భక్తి దాని ఇస్తే చాలుట పరమ ప్రీతితో దగ్గరకు తీసుకుంటాడు’.
“ఆలస్యం వ్యపనీయ భక్తిసులభం ధ్యాయస్వ నారాయణం” ఇంకా ఆలస్యం చేయకుండా ఇతరమైన విషయములను విడిచి పరమాత్మ యొక్క గుణములను స్మరించు చక్కటి జ్ఞానం కలుగుతుంది.
మనము ఇతరములను త్యజిస్తే మనము వెళ్లనవసరము కూడా లేకుండా ఆయననే మన హృదయాంతరముల యందు ప్రవేశించి వసించును.భక్తులకు ఎలాంటి శ్రమలు కలిగించడానికి ఇష్టపడడు అతడే శ్రీమన్నారాయణుడు. అంతటా వ్యాపించి,వహించి,ప్రకాశింపచేయువాడు కాబటి నారాయణుడు.
“గామావిశ్య చ భూతాని ధారయా మ్యహమోజసా |
పుష్ణామి చౌషధీ స్సర్వా స్సోమో భూత్వారసాత్మకః ||” అన్నట్లు పురుషోత్తముడు ఆయనే.
అటువంటి పరమాత్మా వద్ద ‘లోకస్య వ్యసనాపనోదనకరో దాసస్య కిం న క్షమః ‘ మేము నీ దాసుడిని అని వారి దివ్యపాదములపై పడితే చాలు ఏమి చూడకుండా కాపాడడానికి సిద్ధముగా ఉండేవాడు.అంటూ కులశేఖరాళ్వార్లు మనస్సును సిద్దము చేసుకోవలసిన రీతిని చెబుతూనే నెపంగా ఉంచి పరమాత్మ యొక్క వాత్సల్య గుణాలను ప్రకాశింపచేస్తున్నారు.
నిత్య శ్రీ: నిత్య మంగళం.
అడియేన్ రామానుజ దాసన్