వాల్మీకి రామాయణం 103 వ భాగం, అరణ్యకాండ
Posted by adminApr 13
వాల్మీకి రామాయణం 103 వ భాగం, అరణ్యకాండ
అయోధ్యకాండలొ ఒక విషయం చెప్పడం మరిచిపోయాను. రాముడి పాదుకలని భరతుడు తన శిరస్సు మీద పెట్టుకున్నాక, 14 సంవత్సరముల తరువాత రాముడు తిరిగి రాకపోతే, నేను నా శరీరాన్ని అగ్నిలో విడిచిపెట్టేస్తాను అని ప్రతిజ్ఞ చేస్తాడు.
రాముడు ఆ అరణ్యంలో తాపసులు ఉండేటటువంటి ప్రదేశం వైపునకు వెళ్ళాడు.
పుణ్యైః చ నియత ఆహారైః శోభితం పరమ ఋషిభిః |
తత్ బ్రహ్మ భవన ప్రఖ్యం బ్రహ్మ ఘోష నినాదితం |
బ్రహ్మ విద్భిః మహా భాగైః బ్రాహ్మణైః ఉపశోభితం ||
ఆ ఆశ్రమాలలో ఉండేటటువంటి ఋషులు ఆకలిని జయించి నియమముతో కూడిన ఆహారమును తినేవారు, అందరూ వేదం చదువుకున్నారు, ఆ ఆశ్రమంలో ఎప్పుడూ వేద ధ్వని వినపడుతూ ఉండడం వలన ఆశ్రమం బయట నిలబడి చూస్తే, ఆ ఆశ్రమంలో బ్రహ్మగారి సభ జెరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఆ ఆశ్రమము దెగ్గర యజ్ఞములలో వాడే సృక్కు, స్రువము మొదలైన పరికరాలు ఉన్నాయి, అలంకారం కోసం సిద్ధం చెయ్యబడ్డ పెద్ద పెద్ద పుష్పమాలికలు ఉన్నాయి. పెరుగు, లాజలు, అక్షతలు మొదలైనవి ఉన్నాయి.
రూప సంహననం లక్ష్మీం సౌకుమార్యం సువేషతాం |
దదృశుర్ విస్మిత ఆకారా రామస్య వన వాసినః ||
వైదేహీం లక్ష్మణం రామం నేత్రైర్ అనిమిషైర్ ఇవ |
ఆశ్చర్య భూతాన్ దదృశుః సర్వే తే వన వాసినః ||
ఆ ఆశ్రమం దెగ్గరికి వచ్చాక, రాముడు తన ధనుస్సు యొక్క వింటినారిని విప్పేసి లోపలికి ప్రవేశించాడు. అప్పుడు సీతారామలక్ష్మణులను చూసిన ఆ ఋషులు, వాళ్ళ సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యంతో విస్మయులై అలా ఉండిపోయారు. బ్రహ్మతేజస్సు ఉన్నటువంటి ఋషులు ఆనాడు రాముడి తేజస్సుని చూసి అలా ఉండిపోయారు.
అప్పుడా ఋషులు ” మహానుభావ! మేము అందరమూ నీకు నమస్కారం చెయ్యాలి. ఎందుకంటే నువ్వు రాజువి, రాజకుటుంబం నుంచి వచ్చినవాడివి. ఇంద్రుడి యొక్క అంశలొ నాలుగవ వంతు అంశ రాజులో ఉంటుంది. వనాలలో దూరంగా ఉన్నవాళ్ళని, నగరాలలో ఉన్నవాళ్ళని రాజు తన శాసనంతో రక్షిస్తాడు. బలం లేనివాడికి రాజు బలం రక్ష, బలం ఉందని చెలరేగిపోయేవాడికి రాజు బలం శిక్ష. రైతులు, వర్తకులు రాజుకి పన్ను కట్టినట్టు మేము కూడా పన్ను కడుతున్నాము, మా తపస్సులో రాజుకి ఆరవ వంతు వాటా వస్తుంది. నువ్వు ధర్మాత్ముడివి, నీకు ధర్మం తెలుసు, అందుకని నువ్వు మమ్మల్ని రక్షించకపోతే ధర్మం తప్పిన వాడివి అవుతావు. మమ్మల్ని అనేక మంది రాక్షసులు నిగ్రహిస్తున్నారు, అందుకని రామ నువ్వు మమ్మల్ని ఆ రాక్షసులనుంచి రక్షించాలి ” అని అన్నారు.