వాల్మీకి రామాయణం 106 వ భాగం, అరణ్యకాండ
Posted by adminApr 16
వాల్మీకి రామాయణం 106 వ భాగం, అరణ్యకాండ
వారు శరభంగ ముని ఆశ్రమానికి చేరుకోగానే, వాళ్ళకి ఆకాశంలో ఒక రథం నిలబడి కనబడింది. ఆ రథానికి ఆకుపచ్చని గుర్రాలు కట్టబడి ఉన్నాయి. ఆ రథం మీద ఒక గొడుగు ఉంది, సూర్యుడో లేక చంద్రుడో వచ్చి నిలబడ్డార, అన్నట్టు ఆ గొడుగు ఉంది. రథం అంతా మెరిసిపోతుంది, ఆ రథం చుట్టూ 25 సంవత్సరములు కలిగిన కొన్ని వందల మందితో సైన్యం నిలబడి ఉంది, వారందరూ పెద్ద ఖడ్గాలు పట్టుకొని, దివ్యమైన తేజస్సుతో ఉన్నారు. ఆ రథంలోని ఆసనం పక్కన వింజామరలు పట్టుకొని దేవతా స్త్రీలు నిలబడి ఉన్నారు. కాని ఆ ఆసనం ఖాళీగా ఉంది. ఆ ఆసనం మీద కూర్చోవాల్సిన వ్యక్తి, శరభంగ మహర్షితో మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన నేల మీద నిలబడి లేడు, గాలిలో నిలబడి ఉన్నాడు.
ఇది గమనించిన రాముడు వెంటనే లక్ష్మణుడిని పిలిచి ” లక్ష్మణా! లక్ష్మణా! మనం వేదంలో చదువుకున్నాము కదా, ఇంద్రుడిని పిలిచేటప్పుడు, ఆకుపచ్చ గుర్రములు కట్టినటువంటి రథం మీద వచ్చె ఇంద్రా, అని పిలుస్తాము కదా, అదిగొ ఆ ఇంద్రుడు ఇప్పుడు శరభంగ మహర్షితో మాట్లాడుతున్నాడు. కావున మనం అందరం ఒకేసారి లోపలికి వెళ్ళిపోకూడదు, అందుకని ముందు నేను లోపలికి వెళ్ళి ఆ ఇంద్రుడిని ఒకసారి చూస్తాను ” అన్నాడు.
అలా లోపలికి వస్తున్న రాముడిని ఇంద్రుడు చూసి, శరభంగుడితో ఇలా అన్నాడు………….
ఇహ ఉపయాతి అసౌ రామో యావన్ మాం న అభిభాషతే |
నిష్ఠాం నయత తావత్ తు తతో మా ద్రష్టుం అర్హతి ||
” రాముడు వచ్చేస్తున్నాడు, రాముడి వంక నేను చూడను, మాట్లాడను. ఎందుకంటే ముందు ముందు రాముడు సాధించవలసిన గొప్ప దేవకార్యం ఒకటి ఉంది, అప్పుడు నేను వచ్చి రాముడిని అభినందిస్తాను. ఇక సెలవు మహర్షి ” అని వెళ్ళిపోయాడు. అప్పుడు రాముడు సీతమ్మని, లక్ష్మణుడిని తీసుకొని శరభంగ ముని ఆశ్రమంలోనికి వెళ్ళి తన రెండు చెవులని పట్టుకొని శరభంగుడికి తన ప్రవర చెప్పి, నేను రాముడిని వచ్చాను అని అన్నాడు.