వాల్మీకి రామాయణం 157 వ భాగం, అరణ్యకాండ
Posted by adminJun 6
వాల్మీకి రామాయణం 157 వ భాగం, అరణ్యకాండ
ఇటుపక్క రామచంద్రమూర్తి మాంసం పట్టుకుని వస్తుంటే, విచిత్రంగా వెనకనుంచి ఒక నక్క కూత వినబడింది. అలాగే రాముడిని దీనంగా చూస్తూ అక్కడున్న మృగాలన్నీ ఎడమ వైపు నుండి ప్రదక్షిణంగా తిరిగాయి. ఈ శకునాలని చూసిన రాముడు, సీతమ్మకి ఏదో జెరిగిందని భావించి గబగబా వస్తుండగా ఆయనకి ఎదురగా లక్ష్మణుడు వచ్చాడు. లక్ష్మణుడిని చూడగానే రాముడి పైప్రాణాలు పైనే ఎగిరిపోయాయి.
అప్పుడాయన లక్ష్మణుడితో ” సీతని వదిలి ఎందుకు వచ్చావు. సీత ప్రమాదంలో ఉందని నేను అనుకుంటున్నాను. సీత క్షేమంగా ఉంటుందా? బతికి ఉంటుందా? నాకు నమ్మకం లేదు. ఎందుకంటే నేను ఖర దూషణులని సంహరించాక రాక్షసులు నా మీద పగబట్టారు. మారీచుడు మరణిస్తూ ‘హా సీతా! హా లక్ష్మణా!’ అన్నాడు. సీత నిన్ను నిగ్రహించి పంపి ఉంటుంది, అందుకని నువ్వు వచ్చావు. నువ్వు వచ్చేశాక సీతని ఆ రాక్షసులు అపహరించడమైనా జెరిగుంటుంది, లేదా ఆమె కుత్తుక కోసి, ఆమెని తినెయ్యడం అయినా జెరిగుంటుంది. ఏదో ప్రమాదకరమైన పని జెరిగుంటుంది. లక్ష్మణా! నువ్వు ఇలా వస్తావని నేను ఊహించలేదు. నువ్వు రాకుండా ఉండి ఉండవలసింది. ఈ ముఖం పెట్టుకొని నేను అయోధ్యకి ఎలా వెళ్ళను. అందరూ వచ్చి సీతమ్మ ఏది అని అడిగితే, నేను ఏమని చెప్పుకోను. అరణ్యవాసానికి తనని అనుగమించి వచ్చిన సీతమ్మని రక్షించుకోలేని పరాక్రమహీనుడు రాముడు, అని అందరూ చెప్పుకుంటుంటే, ఆ మాటలు విని నేను ఎలా బతకను. నేను అసలు వెనక్కి రానే రాను. సీత ఆశ్రమంలో కనపడకపోతే నా ప్రాణాలు విడిచిపెట్టేస్తాను.
ఏ సీత యొక్క ఓదార్పు చేత 13 సంవత్సరాల అరణ్యవాసాన్ని క్షణములా గడిపానో, ఆ సీత నా కంటపడనప్పుడు నాకు రాజ్యం అక్కరలేదు, అంతఃపుర భోగములు అక్కరలేదు. నువ్వు అయోధ్యకి వెళ్ళి, నేను చెప్పానని చెప్పి, భరతుడిని పట్టాభిషేకం చేసుకొని రాజ్యం ఏలమన్నానని చెప్పు. నా తల్లి కౌసల్యని సేవించు. నేను అయోధ్యకి తిరిగొస్తే, జనకుడు నన్ను చూసి ‘ రామ! నీకు కన్యాదానం చేశాను కదా, ఏదయ్యా సీతమ్మ’ అని అడుగుతారు, అప్పుడు నేను జనకుడి ముఖాన్ని ఏ ముఖంతో చూడను. సీతని వదిలి రావద్దని నేను నిన్ను ఆజ్ఞాపించాను. కాని నా ఆజ్ఞని పాటించకుండా సీతని వదిలి నువ్వు ఒక్కడివీ ఎందుకు వచ్చావు ” అన్నాడు.
అప్పుడు లక్ష్మణుడు ” అన్నయ్య! నా అంత నేనుగా రాలేదు, సీతమ్మని విడిచిపెట్టి రాలేదు. నీ మాటని పాటిద్దామని ప్రతిక్షణం సీతమ్మ దెగ్గరే ఉండి జాగ్రత్తగా కాపు కాశాను.
ఆర్యేణ ఏవ పరిక్రుష్టం – పరాక్రుష్టం – హా సీతే లక్ష్మణ ఇతి చ |
పరిత్రాహి ఇతి యత్ వాక్యం మైథిల్యాః తత్ శ్రుతిం గతం ||
కాని ఎప్పుడైతే అరణ్యంలోనుంచి నీ గొంతుతో ‘హా సీతా! హా లక్ష్మణా’ అన్న మాటలు సీతమ్మ విన్నదో, నీయందు ఉన్నటువంటి అపారమైన ప్రేమ చేత భయవిహ్వల అయిపోయింది. అప్పుడు సీతమ్మ ఏడుస్తూ, లక్ష్మణా వెళ్ళు, అని నన్ను ఒకటికి పదిమార్లు తొందరచేసింది. కాని మా అన్నయ్య అలా నీచంగా రక్షించండి అని ఒక్కనాటికి అరవడు, ఇది రాక్షస మాయ అని సీతమ్మకి చెప్పాను. కాని ‘నువ్వు భరతుడితో కలిసి కుట్ర చేసి, నన్ను పొందడానికి రాముడి వెనకాల అరణ్యవాసానికి వచ్చావు’ అని సీతమ్మ నన్ను ఒక కఠినమైన మాట అంటె, నేను ఇంక తట్టుకోలేక బయలుదేరి వచ్చేశాను. నాయందు ఏ దోషము లేదన్నయ్య, నన్ను మన్నించు ” అన్నాడు.