వాల్మీకి రామాయణం 170 వ భాగం, కిష్కిందకాండ
Posted by adminJun 19
వాల్మీకి రామాయణం 170 వ భాగం, కిష్కిందకాండ
ఉత్సాహో బలవాన్ ఆర్య నాస్తి ఉత్సాహాత్ పరం బలం |
సః ఉత్సాహస్య హి లోకేషు న కించిత్ అపి దుర్లభం ||
అప్పుడు లక్ష్మణుడు ” అన్నయ్యా! స్నేహము, ప్రేమ ఉండవలసిందే. కాని, మరీ ఇంత పిచ్చి ప్రేమ అయితే భరించడం కష్టం. నువ్వు గుర్తుపెట్టుకో అన్నయ్యా, నీకు ఇంత దుఃఖానికి కారణమైన రావణాసురుడు స్వర్గలోకానికే వెళ్ళని, పాతాళలోకానికే వెళ్ళి దాక్కొనని, మళ్ళి తన తల్లి కడుపులోకి దూరిపోనీ, వాడిని మాత్రం వదలను, చంపితీరుతాను. నువ్వు ఈ దుఃఖాన్ని విడిచిపెట్టు. దుఃఖం పొందితే ఉత్సాహం నశిస్తుంది. ఉత్సాహం ఉంటె ప్రపంచంలో సాధించలేనిది అన్నది ఏది లేదు. కాని ఉత్సాహం పోతే, తనలో ఎంత శక్తి ఉన్నా అదంతా భయం చేత, దుఃఖం చేత పనికిరాకుండా పోతుంది. అందుకని అన్నయ్యా ఉత్సాహాన్ని పొందు ” అని అన్నాడు.
లక్ష్మణుడి మాటలకి రాముడు సంతోషపడినవాడై ఉపశాంతిని పొందాడు. అప్పుడా రామలక్ష్మణులు ఇద్దరూ ఋష్యమూక పర్వతం వైపునకు బయలుదేరారు.
అలా వస్తున్న రామలక్ష్మణులను ఋష్యమూక పర్వత శిఖరముల మీద నుండి సుగ్రీవుడు చూసి భయంతో గడ్డ కట్టుకుపోయాడు. నార చీరలు కట్టుకొని, కోదండాలు పట్టుకుని, అరణ్యంలోని చెట్ల వైపు చూస్తూ వస్తున్న రామలక్ష్మణులని చూసి, వాలి తనని చంపడానికని వీళ్ళని పంపాడేమోనని సుగ్రీవుడు భయపడి తన 4 వానర మంత్రుల దెగ్గరికి వెళ్ళి ” చూశార, ఎవరో ఇద్దరు నార చీరలు కట్టుకున్న వీరులు వచ్చేస్తున్నారు. వాళ్ళు నన్ను చంపడానికే వస్తున్నారు. రండి పారిపోదాము ” అని ఆ నలుగురు వానరములతో కలిసి ఒక శిఖరం మీదనుండి మరొక శిఖరం మీదకి దూకాడు. వాళ్ళు వచ్చేస్తున్నారేమో అన్న భయంతో అలా ఒక్కో శిఖరాన్ని దాటాడు. వాళ్ళు అలా గెంతుతుంటే, చెట్లు విరిగిపోయాయి, ఏనుగులు, పులులు దిక్కులు పట్టి పారిపోయాయి. అలా కొంతసేపు గెంతి గెంతి, తన మంత్రులతో కలిసి ఒక చోట కూర్చున్నాడు. ( సుగ్రీవుడి మంత్రులలో హనుమంతుడు ఒకడు ).