వాల్మీకి రామాయణం 172 వ భాగం, కిష్కిందకాండ

కపి రూపం పరిత్యజ్య హనుమాన్ మారుతాత్మజః |
భిక్షు రూపం తతో భేజే శఠబుద్ధితయా కపిః ||
అప్పుడు హనుమంతుడు తన కపి రూపాన్ని విడిచిపెట్టి, భిక్షు రూపాన్ని( సన్యాసి రూపాన్ని) పొంది, శఠ బుద్ధితో బయలుదేరి రాముడి దెగ్గరికి వెళ్ళాడు. సన్యాసి రూపంలో ఉన్న హనుమంతుడు రాముడి దెగ్గరికి వెళ్ళి నమస్కరించి ” మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు రాజర్షుల లాగ, తాపసుల లాగ ఉన్నారు. విశేషమైన కాంతితో ఉన్నారు. మీరు నడిచి వస్తుంటే, మిమ్మల్ని చూసి మృగాలన్నీ పారిపోతున్నాయి. మిమ్మల్ని చూసి ఇక్కడున్న సర్వ భూతములు భయపడుతున్నాయి. మీ యొక్క కాంతి చేత ఇక్కడున్న నదులలోని జలములు శోభిస్తున్నాయి. మీరు నడుస్తుంటే, సింహాలు నడుస్తున్నాయా? అన్నట్టుగా ఉంది. సింహాల యొక్క బలాన్ని అధిగమించిన స్వరూపంతో ఉన్నారు. మీ చేతులలో కొదండాలు, బాణాలు ఉన్నాయి. మిమ్మల్ని చూస్తుంటే ఎటువంటి శత్రువునైనా సంహరించగలిగిన పరాక్రమము చేత విరాజిల్లుతున్న వారిలా కనపడుతున్నారు. ఠీవిగా నడిచే ఎద్దుల్లా నడుస్తున్నారు. నడుస్తున్న పర్వతాల్లా ఉన్నారు. పద్మములవంటి కన్నులతో ఉన్నారు, జటామండలాలు కట్టుకొని ఉన్నారు. ఈ రూపములు ఒకదానితో ఒకటి సరిపోవడం లేదు. మీరు సూర్య-చంద్రుల్లా ఉన్నారు, విశాలమైన వక్షస్థలంతో ఉన్నారు. మనుష్యరూపంలో ఉన్న దేవతల్లా ఉన్నారు. పెద్ద భుజాలతో ఉన్నారు. మీ బాహువుల చేత ఈ సమస్త పృధ్వీ మండలాన్ని రక్షించగలిగిన వారిలా కనపడుతున్నారు. అటువంటి మీరు ఇలా ఎందుకు నడిచి వస్తున్నారు. దీనికి కారణం ఏమిటి. మీ మొలలకి చాలా పెద్ద కత్తులు కట్టి ఉన్నాయి. ఆ కత్తుల్ని చూస్తే భయం వేస్తుంది.  

నేను సుగ్రీవుడి యొక్క సచివుడిని, నన్ను హనుమ అంటారు. అన్నగారైన వాలి చేత తరమబడినటువంటి మా రాజైన సుగ్రీవుడు రాజ్యాన్ని విడిచిపెట్టి ఋష్యమూక పర్వత శిఖరముల మీద నలుగురు మంత్రులతో కలిసి ఉంటున్నాడు. ఆయన ధర్మాత్ముడు, మీతో స్నేహం చెయ్యాలని అనుకుంటున్నాడు. అందుకని మీరు మా ప్రభువుతో ఎందుకు స్నేహం చెయ్యకూడదు! నేను ఎన్నో విషయాలు మాట్లాడుతున్నాను, మీరు నాతో మాట్లాడడంలేదు. మీరు మాట్లాడితే వినాలని ఉంది. మీరు మాట్లాడండి ” అని చెప్పి హనుమ నిలబడిపోయాడు.

రాముడిని చూడగానే సన్యాసి రూపంలో ఉన్న హనుమంతుడు ఆ సన్యాసి రూపాన్ని విడిచిపెట్టేసి తన నిజ స్వరూపానికి వచ్చేశాడు. ఎందుకంటే, ఆయనకి రాముడు శ్రీ మహా విష్ణువుగా దర్శనమిచ్చారు.