వాల్మీకి రామాయణం 176 వ భాగం, కిష్కిందకాండ

అప్పుడు సుగ్రీవుడి రాముడితో ” అయ్యయ్యో, అలా ఏడవకు రామ. నేను కూడా నీలాగే కష్టపడుతున్నాను. నువ్వే ఆలోచించు, నేను నీలా ఏడుస్తున్నాన? నీలాగే నా భార్య కూడా అపహరింపబడింది. నీకు చెప్పగలిగేంత సమర్దుడిని కాదు, కాని ఒక్కసారి నీకు జ్ఞాపకం చేద్దామని స్నేహ లక్షణంతో చెప్పాను. నీ యొక్క దుఃఖాన్ని ఉపశమింప చేసుకో, నాయందు ఉన్న స్నేహాన్ని జ్ఞాపకం చేసుకో ” అన్నాడు.


వెంటనే రాముడు స్వస్థతని పొంది ” ఉత్తమమైన మిత్రుడు ఎటువంటి మాట చెప్పాలో అటువంటి మాట చెప్పావయ్య సుగ్రీవా. కాని నాకు ఒక విషయం చెప్పు. ఈ రాక్షసుడు ఎక్కడ ఉంటాడో నాకు చెప్పు, నేను వెంటనే వెళ్ళి రాక్షస సంహారం చేస్తాను ” అన్నాడు.

అప్పుడు సుగ్రీవుడు ” నేను సత్యం చెబుతున్నాను, నా మాట నమ్ము. నీ భార్యని తీసుకొచ్చే పూచి నాది. కాని నీ భార్యని అపహరించిన రాక్షసుడి పేరు నాకు తెలీదు. ఎక్కడుంటాడో నాకు తెలీదు. నువ్వు బెంగ పెట్టుకోవద్దు, ముందు నా కార్యానికి సహాయం చెయ్యి ” అన్నాడు.

అప్పుడు రాముడు ” ఆ వాలి ఎక్కడ ఉంటాడో చెప్పు, నేను వెంటనే సంహరిస్తాను. ఇంతకముందెన్నడు నేను అసత్యం పలకలేదు, ఇక ముందు కూడా అసత్యం పలకను. నీకు మాట ఇచ్చిన ప్రకారం వాలిని సంహరిస్తాను ” అన్నాడు.

ఈ మాటలు విన్న సుగ్రీవుడు ” నువ్వు ఇంత మాట అన్నావు, నాకు ఇంకేమి కావాలి. నీలాంటి స్నేహితుడు లభిస్తే స్వర్గలోకమే లభిస్తుంది, ఇక వానర రాజ్యం లభించడం గొప్ప విషయమా ” అన్నాడు.

అప్పుడు రాముడు ” అసలు ఏమి జెరిగిందో నాకు చెప్పు, నువ్వు ఈ కొండ మీద బతకవలసిన అవసరం ఎందుకు ఏర్పడింది. నాకు అన్నీ వివరంగా చెప్పు ” అన్నాడు.

అప్పుడు సుగ్రీవుడు జెరిగిన కథని సంగ్రహంగా రాముడికి వివరించాడు. సుగ్రీవుడు చెప్పిన కథ విన్న రాముడు ” అసలు నీకు, నీ అన్న అయిన వాలికి ఎందుకు శత్రుత్వం ఏర్పడింది. నువ్వు నాకు ఆ విషయాన్ని పూర్తిగా చెపితే, నేను మీ ఇద్దరి బలాబలాలని అంచనా వేస్తాను. అప్పుడు మనం వెంటనే వెళ్ళవచ్చు ” అన్నాడు.