వాల్మీకి రామాయణం 177 వ భాగం, కిష్కిందకాండ
Posted by adminJun 26
వాల్మీకి రామాయణం 177 వ భాగం, కిష్కిందకాండ
అప్పుడు సుగ్రీవుడు అసలు కథని వివరంగా ఇలా చెప్పాడు ” రామ! ఒకానొకప్పుడు మా తండ్రి అయిన ఋక్షరజస్సు ఈ వానర రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ ఋక్షరజస్సుకి ఇంద్రుడి అనుగ్రహంగా వాలి ఔరసపుత్రుడిగా జన్మించాడు, సూర్యుడి అనుగ్రహంగా నేను ఔరసపుత్రుడిగా జన్మించాను. పెద్ద కుమారుడైన వాలి తండ్రి యొక్క ప్రీతిని పొందాడు. నేను కూడా చాలాకాలం వాలిని ప్రీతితో అనుగమించాను. కొంతకాలానికి ఋక్షరజస్సు శరీరాన్ని విడిచిపెట్టాక, పెద్ద కుమారుడు కనుక వాలికి పట్టాభిషేకం చేశారు. నేను వాలియందు వినయవిధేయలతో, భయభక్తులతో ఉండేవాడిని.
దుందుభి అనే రాక్షసుడి అన్న అయిన మయుడికి ఒక కుమారుడు ఉన్నాడు, వాడి పేరు మాయావి. ఆ మాయవికి, వాలికి ఒక స్త్రీ సంబంధంగా వైరం వచ్చింది. ఆ కారణం చేత మాయావి ఒకరోజు రాత్రి కిష్కిందా ద్వారం దెగ్గరికి వచ్చి గట్టిగా కేకలు వేసి ‘ వాలి బయటకి రా, మనిద్దరమూ యుద్ధం చేద్దాము. ఈరోజుతో నిన్ను సంహరిస్తాను ‘ అన్నాడు. అప్పటివరకూ తన భార్యలతో సంతోషంగా కాలం గడుపుతున్న వాలి గబగబా బయటకి వచ్చాడు. అప్పుడు నేను కూడా బయటకి వచ్చాను. ఆ మాయావి మా ఇద్దరినీ చూసి భయపడి పారిపోయాడు. అక్కడున్న స్త్రీలు ‘ ఎలాగు వాడు పారిపోతున్నాడు కాదా, ఇంక విడిచిపెట్టు ‘ అన్నారు. కాని, శత్రువుని విడిచిపెట్టనని వాలి వాడి వెనకాల పరిగెత్తాడు. అప్పుడు నేను కూడా వాలి వెనకాల వెళ్ళాను.
పరిగెత్తి పరిగెత్తి, తృణముల చేత కప్పబడిన ఒక పెద్ద బిలంలోకి ఆ మాయావి దూరిపోయాడు. అక్కడికి వెళ్ళి నేను, వాలి నిలబడ్డాము. అప్పుడు వాలి నాతో ‘ సుగ్రీవా! నువ్వు ఈ బిల ద్వారం దెగ్గర కాపలాగా ఉండు, నేను ఇందులోకి వెళ్ళి ఆ రాక్షసుడిని సంహరించి వస్తాను. నువ్వు నా తమ్ముడివి, చిన్నవాడివి నా పాదముల మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను, నువ్వు ఇక్కడే ఉండు ‘ అని చెప్పి వాలి గుహలోపలికి వెళ్ళాడు.