వాల్మీకి రామాయణం 186 వ భాగం, కిష్కిందకాండ
Posted by adminJul 5
వాల్మీకి రామాయణం 186 వ భాగం, కిష్కిందకాండ
సుగ్రీవుడు సరే అని బయలుదేరాడు. ఆయన వెనకాల రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు మొదలైన వారు బయలుదేరారు. అలా వారు వెళుతూ లోయలని, నదులని, పర్వతాలని, చెట్లని చూసుకుంటూ వెళుతున్నారు. అప్పుడు వాళ్ళకి పక్కన నుంచి అక్షర సముదాయము చేత అవ్యక్తమైనటువంటి గంధర్వ గానం ఒకటి వినపడింది. అది వింటున్నప్పుడు వాళ్ళ మనస్సులకి ఆనందం కలుగుతోంది. అక్కడ ఉన్న చెట్లపైకి పావురాల రంగులో పొగలు చుట్టుకొని ఉన్నాయి. అప్పుడు రాముడు, ఈ వనం ఏమిటి? అని సుగ్రీవుడిని అడిగాడు. కాని సుగ్రీవుడు ఆగకుండా ముందుకి వెళ్ళిపోతూ ” రామ! ఇక్కడ సప్తజనులు అనేటటువంటి 7 ఋషులు ఉండేవారు. వారు తలలు కిందకి పెట్టి, కాళ్ళు పైకి పెట్టి 700 సంవత్సరాలు తపస్సు చేశారు. అలా 700 సంవత్సరాలు తపస్సు చేస్తూ ప్రతి 7 రాత్రులకి ఒకసారి గాలిని తినేవారు. వాళ్ళ తపస్సుకి ఇందుడు ఆశ్చర్యపోయి, సశరీరంగా స్వర్గలోకానికి తీసుకువెళ్ళాడు. వాళ్ళ తపోశక్తి ఇప్పటికీ ఈ వనంలో ఉంది, అందువలన క్రూరమృగం ఈ వనంలోకి వెళ్ళదు, వెళితే ఇక తిరిగిరాదు. నువ్వు లక్ష్మణుడితో కలిసి నమస్కారం చెయ్యి ” అన్నాడు.
అప్పుడు లక్ష్మణుడితో కలిసి రాముడు ఆ సప్తజనుల ఆశ్రమం వైపుకి తిరిగి నమస్కారం చేశాడు. అలా వారు నమస్కారం చెయ్యగానే వాళ్ళ మనస్సులో గొప్ప ఉత్సాహం పుట్టింది.