వాల్మీకి రామాయణం 189 వ భాగం, కిష్కిందకాండ

అయిదింటి మాంసాన్ని మాత్రమే బ్రాహ్మణులు, క్షత్రియులు తినాలని ధర్మశాస్త్రం చెబుతుంది. ( త్రేతా యుగంలో బ్రాహ్మణులు కూడా మాంసాన్ని తినేవారు, కలికాలంలో అది నిషిద్దము. అరణ్యకాండలో అగస్త్య మహర్షి వాతాపి, ఇల్వలుడు అనే రాక్షసులని చంపేముందు మాంసాహారాన్ని తిన్నారు). అయిదు గోళ్ళున్న వాటిల్లో ముళ్ళపంది మాంసాన్ని తినచ్చు, చెవుల పిల్లి మాంసాన్ని తినచ్చు, ఉడుము మాంసాన్ని తినచ్చు, తాబేలు మాంసాన్ని తినచ్చు, కుక్కలని తరిమి చంపే ఏదుపంది మాంసాన్ని తినవచ్చు. ఇంక ఆరవదాని మాంసం తినకూడదు. ఒకవేళ అలా తిన్నా, రాజ్యం చేస్తున్న రాజుని చంపినా, గోవుని చంపినా, బ్రాహ్మణుడిని చంపినా, అలా చేసిన వారికి పాతకం చేసిన పాపం వస్తుంది. నువ్వు నన్ను చంపడానికి కారణం ఏమిటి. నువ్వు చేసినవి దోషాలు కావా? నాకు జవాబు చెప్పు.

ఏమయ్యా, నీ భార్య కోసం అడవిలో వెతుక్కుంటున్నావంట కదా, నీ భార్యని ఎత్తుకుపోయిన రావణాసురుడు నా కింకరుడు. నువ్వు నాతో చెప్పి ఉంటె, పశువుని ఈడ్చుకు వచ్చినట్టు రావణుడిని మెడలో పాశం వేసి నీ కాళ్ళ ముందు పడేసేవాడిని. అటువంటిది నాకు చెప్పకుండా, నన్నే గెలవలేని సుగ్రీవుడిని ఆశ్రయించి నువ్వు సీతని ఎలా తెచ్చుకోగలవు. సుగ్రీవుడి కోసం నన్ను చంపావు, ఇది కిరాయి హత్య కాదా? నువ్వు ఈ పని చెయ్యొచ్చా ” అని రాముడిని ప్రశ్నించి, ఇక మాట్లాడడానికి ఓపిక లేక, అలా ఉండిపోయాడు.