వాల్మీకి రామాయణం 199 వ భాగం, కిష్కిందకాండ
Posted by adminJul 18
వాల్మీకి రామాయణం 199 వ భాగం, కిష్కిందకాండ
సుగ్రీవుడు చెప్పిన విధంగా అందరికీ ప్రకటించారు, సుగ్రీవుడు మళ్ళి అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు.
కార్తీకమాసం వచ్చినా సుగ్రీవుడి నుండి ఒక్కమాట కూడా రాకపోవడం చేత రాముడు లక్ష్మణుడిని పిలిచి ” పరస్పర వైరం ఉన్న రాజులందరూ కూడా ఒకరిని ఒకరు దునుమాడుకోడానికి సైన్యంతో యుద్ధానికి వెళ్ళిపోయారు. ఆకాశం అంతా నిర్మలంగా అయిపోయింది. నీటి ప్రవాహములన్నీ పరిశుద్ధము అయ్యాయి, నేల మీద ఉండే బురద ఇంకిపోయింది, చంద్రుడు విశేషమైన వెన్నెల కురిపిస్తున్నాడు, శరత్ ఋతువు వచ్చేసింది. కాని సుగ్రీవుడికి మాత్రం ఈ కాలం వచ్చినట్టుగా లేదు. ఏ ప్రయత్నాన్ని సుగ్రీవుడు ఈ కాలం వచ్చిన తరువాత చెయ్యాలో ఆ ప్రయత్నాన్ని చేసినవాడిగా కనపడడం లేదు.
లక్ష్మణా! సుగ్రీవుడు ఎందుకు ఉపకారం చెయ్యడంలేదో, ఈ గుహ దెగ్గరికి ఎందుకు రావడంలేదో, నాతో ఎందుకు మాట్లాడడం లేదో తెలుసా.
ప్రియా విహీనే దుఃఖ ఆర్తే హృత రాజ్యే వివాసితే |
కృపాం న కురుతే రాజా సుగ్రీవో మయి లక్ష్మణ ||
నాకు ప్రియమైన భార్యని రాక్షసుడు ఎత్తుకుపోయాడు, అపారమైన దుఖంతో ఉన్నాను, ఉన్న రాజ్యమా పోయింది. అటువంటి దీనుడిని కదా, ఇవ్వాళ నా దెగ్గర ఏముంది లక్ష్మణా, గుహలో పడుకొని ఉన్నాను కదా, అందుకని సుగ్రీవుడికి నా మీద కృపలేదయ్యా. నన్ను రక్షిస్తాను అని సుగ్రీవుడు అన్నాడు, ఇవ్వాళ ఆయన ఆ సంగతి మరిచిపోయాడు, నేను ఇప్పుడు అనాథని, రావణుడేమో నన్ను అవమానించాడు, దీనుడిని, ఇంటికి చాలా దూరంగా ఉన్నాను, నేను నా భార్యని పొందాలనే స్థితిలో ఉండి సుగ్రీవుడిని శరణాగతి చేశాను, అయినా సుగ్రీవుడు నాకు ఉపకారం చెయ్యడం లేదు.
ఈ కారణాల వల్లే సుగ్రీవుడు నన్ను ఇంత చిన్న చూపు చూస్తున్నాడు. నాకు ఏమిచెయ్యాలో తెలుసు, ఆ సుగ్రీవుడు చేసుకున్న ఒడంబడిక మరిచిపోయాడు. సీతని ఎలాగైనా అన్వేషిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. కాని ఇప్పుడు తన భార్యలతో కామ సుఖాన్ని అనుభవిస్తున్నాడు.
అర్థినాం ఉపపన్నానాం పూర్వం చ అపి ఉపకారిణాం |
ఆశాం సంశ్రుత్య యో హంతి స లోకే పురుషాధమః ||
ఎవడైతే చేసిన ఉపకారాన్ని మరిచిపోయి తిరిగి ప్రత్యుపకారం చెయ్యడో, వాడు పురుషాధముడు అని శాస్త్రం చెబుతుంది. ఒకమాట నోటివెంట వస్తే ఆ మాటకి ఎవడు కట్టుబడిపోతాడో, వాడిని పురుషోత్తముడు అంటారు. తమ పనులు పూర్తి చేసుకొని, తన మిత్రులకి అక్కరకు రాకుండా జీవితాన్ని గడుపుకుంటున్నవాడి యొక్క శరీరం పడిపోయిన తరువాత కుక్కలు కూడా వాడి శరీరాన్ని తినడానికి ఇష్టపడవు. ఇవ్వాళ సుగ్రీవుడు అటువంటి కృతఘ్నతా భావంతో ప్రవర్తిస్తున్నాడు. నేను మళ్ళి కోదండాన్ని పట్టుకొని వేసే బాణముల యొక్క మెరుపులని చూడాలని, నా వింటినారి యొక్క ధ్వనిని వినాలని సుగ్రీవుడు అనుకుంటున్నట్టు ఉన్నాడు. రాముడికి కోపం వచ్చి యుద్ధ భూమిలో నిలబడిననాడు, రాముడి స్వరూపం ఎలా ఉంటుందో సుగ్రీవుడు మరిచిపోయినట్టున్నాడు. అందుకని, లక్ష్మణా! నువ్వు ఒకసారి కిష్కిందకి వెళ్ళి ‘ మా అన్నగారు కోపం వచ్చి కోదండాన్ని పట్టుకొని బాణములు విడిచిపెడుతున్నప్పుడు ఆయన రూపం చూడాలని అనుకుంటున్నావా సుగ్రీవా ‘ అని అడుగు.
న స సంకుచితః పంథా యేన వాలీ హతో గతః |
సమయే తిష్ఠ సుగ్రీవ మా వాలి పథం అన్వగాః ||
అలాగే నేను చెప్పానని ఈ మాట కూడా చెప్పు ‘ వాలి ఏ దారిలో వెళ్ళిపోయాడో ఆ దారి ఇంకా మూసేయ్యలేదని చెప్పు. చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉండమని చెప్పు. లేకపోతె నీ అన్న వెళ్ళిన దారిలో నిన్ను పంపడానికి మా అన్నయ్య సిద్ధపడుతున్నాడు ‘ అని చెప్పు. ఆనాడు ధర్మము తప్పిన వాలిని ఒక్కడినే ఒకే బాణంతో చంపాను, ఈనాడు సుగ్రీవుడు ధర్మం తప్పినందుకు ఒక బాణంతో సపరివారంగా అందరినీ పంపించేస్తానని చెప్పు ” అని రాముడన్నాడు.