వాల్మీకి రామాయణం 200 వ భాగం, కిష్కిందకాండ

అప్పుడు లక్ష్మణుడు ” ఎందుకన్నయ్యా అన్ని మాటలు, వాడు రాజ్యం పరిపాలించడానికి అనర్హుడు. నీ వల్ల ఉపకారం చేయించుకొని రాజ్యం పొందాడు. ఇప్పుడే వెళ్ళి సుగ్రీవుడిని చంపేస్తాను. అన్నయ్య! ఇంక నేను నా కోపాన్ని ఆపుకోలేను. నీదాకా ఎందుకు, నేనే సుగ్రీవుడిని చంపేస్తాను. సుగ్రీవుడిని చంపేసి అంగదుడికి పట్టాభిషేకం చేస్తాను. ఆ అంగదుడు వెంటనే సైన్యాన్ని పంపించి సీతమ్మని అన్వేషిస్తాడు. సుగ్రీవుడి యొక్క తప్పిదం తలుచుకుంటుంటే, నీ బాధ తలుచుకుంటుంటే నాకు ఇంకా ఇంకా కోపం వచేస్తోంది, అందుకని నేను ఇప్పుడే బయలుదేరిపోతాను ” అన్నాడు.


ఒకవేళ లక్ష్మణుడు నిజంగానే సుగ్రీవుడిని చంపెస్తాడేమో అని రాముడు శాంతించి లక్ష్మణుడితో ” లక్ష్మణా! మనం ఇంతకముందు సుగ్రీవుడితో చేసుకున్న స్నేహం జ్ఞాపకం పెట్టుకోరా. ఆ స్నేహాన్ని జ్ఞాపకం పెట్టుకొని, సుగ్రీవుడు ఎక్కడ దారి తప్పాడో ఆ తప్పిన దారి నుండి మంచి దారిలోకి మళ్ళించు. అంతేకాని, చంపేస్తాను అని అమంగళకరమైన మాటలు మాట్లాడకు నాన్న ” అని చెప్పాడు.

రాముడు అన్ని మాటలు చెప్పినా కాని లక్ష్మణుడి మనసులో కోపం తగ్గలేదు. ఇవ్వాళ మా అన్నయ్యకి సుగ్రీవుడు ఇంత కోపం తెప్పించాడు అనుకొని ఆగ్రహంతో కిష్కిందా నగరం వైపు అడ్డదారి గుండా బయలుదేరాడు. లక్ష్మణుడు వెళుతున్న దారిలో ఒక చెట్టు యొక్క కొమ్మ దారికి అడ్డంగా ఉంది, ‘ నేను వెళుతున్న దారికి అడ్డం వస్తావా ‘ అని ఆ చెట్టుని పెకలించి అవతలపడేసాడు. అలా ఆయన దారిలో అడ్డువచ్చిన వృక్షాలని, రాళ్ళని పెకలిస్తూ, ముక్కలు చేస్తూ ముందుకి వెళ్ళాడు, అలా ఆయన కిష్కింద నగరానికి చేరుకున్నాడు. అలా వేగంగా వస్తున్న లక్ష్మణుడిని చూసి కొంతమంది వానరములు చెల్లాచెదురై పారిపోయారు, లక్ష్మణుడు యుద్ధానికి వస్తున్నాడని తలచి కొంతమంది మహానాదం చేశారు. ఆ సమయానికి సుగ్రీవుడు అంతఃపురంలో తారతో, రుమతో, వానర కాంతలతో విశేషమైన మధుపానం చేసి, హారములన్నీ చెదిరిపోయి, కామభోగమునందు రమిస్తూ ఉన్నాడు.