వాల్మీకి రామాయణం 225 వ భాగం, కిష్కిందకాండ
Posted by adminAug 13
వాల్మీకి రామాయణం 225 వ భాగం, కిష్కిందకాండ
తస్య తు ఏవం బ్రువాణస్య సంహతైః వానరైః సహ ||
ఉత్పేతతుః తదా పక్షౌ సమక్షం వన చారిణాం ||
సంపాతి ఈ మాటలని వానరాలకి చెప్పగానే కాలిపోయిన ఆయన రెక్కలు మళ్ళి పుట్టాయి. అప్పుడాయన తన ఎర్రటి రెక్కలని అటూ ఇటూ ఊపి చూసుకున్నాడు. ఆనందంతో ఆ సంపాతి ఆకాశంలోకి ఎగిరిపోయాడు.
ఇంక అక్కడున్న వానరాలకి ఇది చూడగానే చాలా సంతోషంవేసింది. సముద్రాన్ని దాటుదామని వాళ్ళందరూ కలిసి సముద్రం యొక్క ఉత్తర తీరానికి చేరుకున్నారు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు ” ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకి వెళ్ళగలిగినవాడు ఎవడు. మిగిలిన వానర జాతికి ఎవడు ప్రాణప్రదానం చెయ్యగలిగినవాడు. ఈ సముద్రం దెగ్గర నిలబడిపోయిన వానరాలు సంతోషంగా తిరిగి వెళ్ళి తమ భార్యాపిల్లలని చూసేటట్టు చెయ్యగలిగినవాడు ఎవడు. ఎవరివల్ల ఈ కార్యం జెరుగుతుంది, ఎవరు అంతటి సమర్ధుడు ” అని అడిగారు.
అప్పుడు శరభుడు లేచి, నేను 30 యోజనములు వెళతాను అన్నాడు, అలాగే ఋషభుడు 40 యోజనములు వెళతాను అన్నాడు, గంధమాదనుడు 50, మైందుడు 60, ద్వివిదుడు 70, సుషేణుడు 80. అప్పుడు జాంబవంతుడు లేచి అన్నాడు ” నేను యవ్వనంలో ఉన్నప్పుడు చాలా బలంగా ఉండేవాడిని. పరమేశ్వరుడు త్రివిక్రమావతారంతో(వామన) పెరిగిపోతుంటే నేను ఆయనకి 21 సార్లు ప్రదక్షిణ చేశాను. కాని ఇప్పుడు నేను ముసలివాడిని అయిపోయాను, నేను ఇప్పుడు 90 యోజనాలు ఎగరగలను ” అన్నాడు.
అప్పుడు అంగదుడు అన్నాడు ” నేను 100 యోజనాలు వెళ్ళగలను, కాని తిరిగి మళ్ళి ఈ 100 యోజనాలు రాలేను ” అన్నాడు.