వాల్మీకి రామాయణం 251 వ భాగం, సుందరకాండ
Posted by adminSep 8
వాల్మీకి రామాయణం 251 వ భాగం, సుందరకాండ
అప్పుడు హరిజట అనే రాక్షస స్త్రీ లేచి ” ఈమెని రావణుడు అపహరించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పటినుంచి నా నోటి వెంట లాలాజలం కారిపోతుంది. ఈమెని ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తున్నాను ” అనింది.
ఈ మాటలు విన్న ఏకజట అనే రాక్షస స్త్రీ లేచి అనింది ” నేను బయట పడితే ఎవరన్నా ఈ విషయం చెప్పేస్తారేమో అని భయపడ్డాను. కాని హరిజట బయటపడింది కాబట్టి చెప్తున్నాను, ఆకలితో ఉన్నవాడు ఎదురుగా భోజనాన్ని పెట్టుకుని తినకుండా ఎలా నిగ్రహించుకొని ఉంటాడో, అలా నేను కూడా ఈ నరకాంతని ఎదురుగా పెట్టుకొని తినకుండా నిగ్రహించుకొని ఉన్నాను. ప్రభువు ఎలాగు అనుమతి ఇచ్చాడు కదా ఈమెని దండించమని, కాబట్టి ఈమె పీక పిసికేసి తినేద్దాము. ఈమె హృదయమునకు కిందన ఉండే భాగము, గుండె, మెదడు నాది ” అనింది.
అప్పుడు మిగతా రాక్షస స్త్రీలు, నావి కాళ్ళు, నావి తొడలు, నావి చేతులు అని వాటాలు వేసుకున్నారు.
తరువాత అజముఖి అనే స్త్రీ అనింది ” ఈమెని అందరమూ సరిసమానంగా వాటాలు వేసుకుందాము. తొందరగా కల్లు తీసుకురండి. ఈమెని తింటూ, కల్లు తాగుతూ, నికుంబిలా నాట్యం చేద్దాము” అనింది.
అప్పుడు సీతమ్మ ఏడుస్తూ ” ఇక్కడ మరణిద్దామన్నా కూడా నాకు స్వేఛ్చ లేదు ” అని అనుకొని, ఆ రాక్షస స్త్రీలని చూసి భయపడుతూ కూర్చున్న చోట నుంచి లేచి శింశుపా వృక్షం మొదటికి వెళ్ళి కూర్చుంది.