వాల్మీకి రామాయణం 300 వ భాగం, యుద్ధకాండ

అప్పుడు రాముడు ” ఇప్పటిదాకా మీరందరూ, దోషములు ఉన్నాయా, దోషములు లేవ, తీసుకోవచ్చా, తీసుకోకూడదా అని పలు మాటలు చెప్పారు, నేను ఒక మాట చెబుతున్నాను వినండి. నా దెగ్గరికి వచ్చి భూమి మీద పడి ‘ రామ! నేను నీవాడనయ్యా, నువ్వు నన్ను రక్షించు ‘ అనినవాడియందు నేను గుణదోష విచారణ చెయ్యను.

సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే
అభయం సర్వ భూతేభ్యో దదామ్యేతద్ వ్రతం మమ
వచ్చినవాడు విభీషణుడే కాని, రావణుడే కాని, నన్ను శరణు కోరినవాడు ఎవడైనా సరె రక్షిస్తాను. యదార్ధమునకు ఇటువంటి యుద్ధం జెరుగుతున్నప్పుడు పక్క రాజ్యం మీద ఇద్దరికి ఆశ ఉంటుంది. అదే కులంలో జన్మించినవాడు ఎవడు ఉంటాడొ వాడికి రాజ్యాధికారం మీద ఆశ ఉంటుంది, అలాగే పక్కనున్న రాజుకి ఆశ ఉంటుంది. అందుకని ఈ రెండిటి విషయంలో మనం తటస్థులము, కాని ఈ రెండు కారణములు తన వైపు ఉన్నాయి కాబట్టి విభీషణుడు వచ్చి శరణాగతి అడిగాడు.

సుగ్రీవ! ప్రపంచంలో భరతుడులాంటి సోదరుడు ఉండడు(కోరి వచ్చిన రాజ్యాన్ని వదిలాడు కనుక), నాలాంటి కొడుకు ఉండడు(తండ్రి ప్రేమని అంతలా పొందాడు కనుక) , నీలాంటి మిత్రుడు ఉండడు. అందుకని అన్నీ ఆ కోణంలొ పోల్చి చూడకు. వాడు దుష్టుడు కాని, మంచివాడు కాని, నా దెగ్గరికి వచ్చి శరణాగతి చేశాడు కనుక ఆయనకి శరణు ఇచ్చేస్తాను. ఈ బ్రహ్మాండములో ఉన్న పిశాచములు, దానవులు, యక్షులు, ఈ సమస్త పృధ్విలో ఉన్న భూతములు కలిసి నా మీదకి యుద్ధానికి వస్తే, నేను నా చిటికిన వేలి గోటితో చంపేస్తాను.