వాల్మీకి రామాయణం 333 వ భాగం, యుద్ధకాండ

అప్పుడు రాముడు ” భయంకరమైన యుద్ధం చేశావు రావణా. నీ ఖడ్గం విరిగిపోయింది, నీ గుర్రాలు చనిపోయాయి, నీ సారధి మరణించాడు, నీ ధ్వజం కిందపడిపోయింది, నీ రథం ముక్కలయ్యింది, నీ చేతిలో ఉన్న కోదండం విరిగిపోయింది, నీ కిరీటం కింద పడిపోయింది, నీ చేతిలో ఒక్క ఆయుధం లేదు. ఇప్పటివరకూ నా వాళ్ళని పడగొట్టి బాగా అలసిపొయావు, నీ కళ్ళల్లో భయం కనపడుతుంది, నీ ఒంటికి చెమట పట్టింది, నిన్ను విడిచిపెట్టేస్తున్నాను. పోయి ఇవ్వాళ రాత్రి పడుకో, విశ్రాంతి తీసుకో, మళ్ళి రేపు ఉత్తమమైన రథాన్ని ఎక్కు, చేతిలో ఆయుధాన్ని పట్టుకొని యుద్ధానికి రా, నా పరాక్రమము ఏమిటో చూద్దువు కాని, ఇవ్వాల్టికి పొ ” అన్నాడు.  

రావణుడు వెనక్కి తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోయాడు. అప్పుడాయన మంత్రులందరినీ, సైన్యాన్ని పిలిచి, సిగ్గుతో తల వంచుకొని ” గరుగ్మంతుడు పాములని తినేసినట్టు, ఏనుగులు సింహము చేత ఓడింపబడినట్టు, ఇవ్వాళ నేను రాముడి బాణముల చేత ఓడింపబడ్డాను. ఇవ్వాళ ఒక నరుడు నా రాజ్యానికి వచ్చి, నన్ను కొట్టి, చంపకుండా వదిలేసి, ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకొని రేపు మళ్ళి స్వస్తతని పొంది, ఆయుధాన్ని పట్టుకొని, రథం ఎక్కి రా, చూపిస్తాను నా పరాక్రమము అన్నాడు.