వాల్మీకి రామాయణం 377 వ భాగం, యుద్ధకాండ
Posted by adminJan 12
వాల్మీకి రామాయణం 377 వ భాగం, యుద్ధకాండ
” అమ్మ! ఈ మాట చెప్పడం నీకే చెల్లింది తల్లి ” అని సీతమ్మతో అని, అక్కడినుంచి బయలుదేరి రాముడి దెగ్గరికి వెళ్ళి ” రామ! సీతమ్మ నీ దర్శనం చెయ్యాలని అనుకుంటోంది ” అని రాముడితో చెప్పాడు.
హనుమంతుడు చెప్పిన మాట విన్న రాముడు కొంచెంసేపు ఆలోచించాడు, ఆ సమయంలో ఆయన కళ్ళల్లో నీళ్ళు నిండాయి. చాలా శోకం పొందినవాడిలా అయ్యి, ఒకసారి భుమివంక చూసి, తన పక్కన ఉన్న విభీషణుడిని పిలిచి ” విభీషణ! నువ్వు లోపలికి వెళ్ళి, సీతకి నేను చెప్పానని చెప్పి తలస్నానం చేయించి, పట్టు వస్త్రం కట్టించి, అన్ని అలంకారములు చేసి నా దెగ్గరికి ప్రవేశపెట్టు ” అన్నాడు.
రాముడి మాటలు విన్న విభీషణుడు ఆశ్చయపోయి సీతమ్మ దెగ్గరికి వెళ్ళి ” సీతమ్మ! నువ్వు తల స్నానం చేసి, పట్టుబట్ట కట్టుకొని, ఒంటినిండా అలంకారాలు చేసుకుని వస్తే రాముడు నిన్ను చూడాలని అనుకుంటున్నాడు ” అన్నాడు.
సీతమ్మ అనింది ” నేను ఎలా ఉన్నానో అలానే వచ్చి రామదర్శనం చేసుకోవాలని నా మనస్సు కోరుకుంటోంది ” అనింది.
విభీషణుడు అన్నాడు ” అమ్మా! అది రామ ఆజ్ఞ. ప్రభువు ఎలా చెప్పాడో అలా చెయ్యడం మంచిది. అంతఃపుర కాంతలు నీకు తలస్నానం చేయిస్తారు, నువ్వు దివ్యాంగరాదములను అలదుకొని, మంచి భూషణములను వేసుకొని, రాముడికి దర్శనం ఇవ్వమ్మా ” అన్నాడు.