వాల్మీకి రామాయణం 386 వ భాగం, యుద్ధకాండ
Posted by adminJan 21
వాల్మీకి రామాయణం 386 వ భాగం, యుద్ధకాండ
ఆరోజు రాత్రి అక్కడ విశ్రమించారు, మరునాడు ఉదయం రాముడు విభీషణుడిని పిలిచి ” నేను తొందరగా అయోధ్య చేరుకోవాలని అనుకుంటున్నాను. ఇక్కడినుంచి కాలి నడకన వెళితే చాలా సమయం పడుతుంది కనుక తొందరగా వెళ్ళడానికి ఏదన్నా ప్రయాణ సాధనం ఏర్పాటు అవుతుందా ” అన్నాడు.
విభీషణుడు ” మన దెగ్గర పుష్పక విమానం ఉంది, ఉత్తర క్షణంలో మీరు అయోధ్యకి చేరిపోతారు. ఇన్ని కష్టాలు పడ్డారు కదా, సీతమ్మ లభించింది కదా, సీతమ్మ అభ్యంగన స్నానం ఆచరించి, పట్టు పుట్టం కట్టుకుని, నగలు అలంకరించుకుంది కదా, మీరు కూడా తలస్నానం చేసి, పట్టు పుట్టాలు కట్టుకుని, ఆభరణములను దాల్చి, నా దెగ్గర బహుమతులు అందుకొని మీరు బయలుదేరితే నేను ప్రీతి పొందుతాను ” అన్నాడు.
అప్పుడు రాముడు ” నా తమ్ముడైన భరతుడు అక్కడ జటలు పెంచుకొని, మట్టి పట్టిన వస్త్రం కట్టుకొని, నా పాదుకలని సింహాసనం మీద పెట్టి, నన్ను చూడాలని శోకిస్తు రాజ్యం చేస్తున్నాడు. ఆ భరతుడు స్నానం చెయ్యకముందు నేను స్నానం చెయ్యనా. భరతుడు పట్టుపుట్టం కట్టుకోకముందు నేను కట్టుకోన. భరతుడు ఆభరణాలు పెట్టుకోకముందు నేను పెట్టుకోన. నాకు తొందరగా భరతుడిని చూడాలని ఉంది ” అన్నాడు.