వాల్మీకి రామాయణం 391 వ భాగం, యుద్ధకాండ
Posted by adminJan 26
వాల్మీకి రామాయణం 391 వ భాగం, యుద్ధకాండ
రాముడు పుష్పక విమానం నుంచి కిందకి దిగగానే భరతుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్నగారి పాదాలకి పాదుకలు తొడిగాడు. ఇది చూసి సుగ్రీవ విభీషణులు కన్నుల నీళ్ళు కారాయి. వెంటనే భరతుడు సుగ్రీవుడిని కౌగలించుకొని ” ఇంతకముందు మేము నలుగురము, ఇవ్వాల్టి నుంచి మనం అయిదుగురము అన్నదమ్ములము సుగ్రీవ ” అన్నాడు. తరువాత అక్కడున్న గంధమాదుడిని, మైందుడిని మొదలైనవారిని భరతుడికి పరిచయం చేశారు. అప్పుడు భరతుడు ఆ వానరాలని ‘ మీరు మా అన్నయ్యకి సహాయం చేశారు, మీరు ఎంత మంచివారు ‘ అని అందరినీ కౌగలించుకున్నాడు.
పుష్పకం నుంచి కిందకి దిగిన వానరకాంతలు వాళ్ళ ప్రేమలని, వాళ్ళ అలంకారాలని చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు అక్కడికి వచ్చిన కౌసల్య, కైకేయ, సుమిత్రలు అన్నారు ” ఈ వానర కాంతలందరికి మేమే తలస్నానాలు చేయిస్తాము ” అని, వాళ్ళందరికీ తలస్నానం చేయించారు.
తరువాత రాముడు ఆ పుష్పక విమానాన్ని ” కుబేరుడి దెగ్గరికి వెళ్ళిపో ” అని ఆజ్ఞాపించాడు. అప్పుడా ఆ పుష్పకం కుబేరుడి దెగ్గరికి వెళ్ళిపోయింది.
అప్పుడు భరతుడు శిరస్సున అంజలి ఘటించి రాముడితో ” మా అమ్మ అయిన కైకేయి ఆనాడు రెండు వరాలు అడిగింది. ఇక్ష్వాకు వంశంలో పెద్దవాడిగా పుట్టి, రాజ్యం పొందడానికి సమస్త అర్హతలు కలిగి ఉన్న నువ్వు, తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసం రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావు. నీ పాదుకలని న్యాసంగా ఇచ్చి నన్ను రాజ్యం చెయ్యమన్నావు. నువ్వు నాకు రాజ్యాన్ని ఎలా ఇచ్చావో, అలా ఆ రాజ్యాన్ని తీసుకొచ్చి నీ పాదాల దెగ్గర పెట్టేస్తున్నాను. నీకు ఉన్నదానిని నాకు ఇచ్చి, నేను దానిని అనుభవిస్తుంటే చూసి నువ్వు మురిసిపోయావు, అందుకని ఇవ్వాళ నేను దానిని నీకు ఇచ్చేస్తున్నాను ” అన్నాడు.
భరతుడి మాటలకి సంతోషించిన రాముడు తిరిగి రాజ్యాన్ని స్వీకరించడానికి అంగీకరించాడు.